India
oi-Korivi Jayakumar
సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా కుటుంబాలు చిద్రమవుతున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. క్షణిక సుఖం కోసం కొందరు తమ కుటుంబ బంధాలను కూడా పణంగా పెడుతున్నారు. అలాంటి షాకింగ్ ఘటన ఒకటి గుజరాత్ లో వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధాన్ని వ్యతిరేకించిందనే కారణంతో ఓ కుమారుడు తన తల్లినే హతమార్చడం సభ్యసమాజాన్ని కలవరపెడుతోంది. ఇక్కడ మరో దారుణమైన విషయం ఏంటంటే సదరు వ్యక్తి సంబంధం పెట్టుకున్నది తన సొంత అన్న భార్యతో. జుగుప్సాకరంగా అనిపిస్తున్న ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
అన్న భార్యతోనే..
ఈ ఘటన సూరత్ లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం 55 ఏళ్ల హమీదా ఖాతూన్ అనే మహిళకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే పర్వేజ్కు తన అన్నయ్య భార్య షబానాతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న హమీదా ఖాతూన్ తీవ్రంగా వ్యతిరేకించేది. దీనిపై ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. తమ సంబంధానికి అడ్డుగా ఉందని భావించిన పర్వేజ్, షబానా కలిసి ఆమెను హతమార్చాలని కుట్ర పన్నారు. ఈ కుట్రలో షబానా తండ్రి ఫిరోజ్ ఆలం కూడా భాగస్వామి అయ్యాడు.
ఈ క్రమంలోనే మార్చి 10న ముగ్గురు నిందితులు కలిసి హమీదాను గొంతు కోసి హత్య చేశారు. అనంతరం నేరాన్ని దాచిపెట్టేందుకు శవాన్ని ప్లాస్టిక్ సంచిలో చుట్టి చేతులు, కాళ్లను తాళ్లతో బిగించారు. ఆ తర్వాత నగరంలోని ఒక దేవాలయం సమీపంలో శవాన్ని పడేసి అక్కడి నుంచి పారిపోయారు. హత్య అనంతరం నిందితులు పోలీసులను మభ్యపెట్టేందుకు మరో ప్లాన్ వేశారు. తన తల్లి మార్కెట్కు వెళ్లి తిరిగి రాలేదని, కనిపించకుండా పోయిందని పర్వేజ్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు చేశాడు. అయితే కేసు అనుమానాస్పదంగా అనిపించడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు.
సీసీటీవీ ఫుటేజ్తో వెలుగులోకి వచ్చిన నిజం..
ఈ కేసులో Surat Crime Branch రంగంలోకి దిగడంతో కీలక ఆధారాలు బయటపడ్డాయి. హమీదా శవానికి కట్టిన తాళ్లు, ఇంట్లో ఉన్న తాళ్లతో ఒకే రకంగా ఉండటం పోలీసులకు అనుమానం కలిగించింది. అలాగే సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించగా శవాన్ని సంచిలో మోసుకెళ్తున్న వ్యక్తి షబానా తండ్రి ఫిరోజ్ ఆలం అని గుర్తించారు. దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు పర్వేజ్, షబానాలను సూరత్లోనే అదుపులోకి తీసుకున్నారు. హత్య అనంతరం బీహార్కు పారిపోయిన ఫిరోజ్ ఆలాన్ని పోలీసులు గాలింపు చేపట్టి చివరకు Patna Railway Station వద్ద అరెస్ట్ చేశారు.
కాగా కుటుంబ బంధాలను మరిచి అక్రమ సంబంధం కోసం తల్లినే హతమార్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇటువంటి ఘటనలు సమాజంలో విలువలు ఎలా క్షీణిస్తున్నాయో మరోసారి గుర్తు చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


