Telangana
oi-Dr Veena Srinivas
ఇరాన్, ఇజ్రాయిల్ అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరతకు కారణమవుతుంది. ఈ యుద్ధ పరిస్థితులు భారతదేశాన్ని సైతం ఇబ్బంది పెడుతున్నాయి. ప్రస్తుతం దేశంలో గ్యాస్ కొరత కొనసాగుతుందని ప్రజలలో ఆందోళన వ్యక్తం అవుతుంది. అయితే గ్యాస్ కొరత లేకున్నా కృత్రిమ గ్యాస్ కొరతను సృష్టిస్తున్నారని ప్రభుత్వాలు మండిపడుతున్నాయి.
తెలంగాణాలో గ్యాస్ కొరత లేదన్న మంత్రి
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కృత్రిమ గ్యాస్ కొరతను సృష్టిస్తే ఏజెన్సీల లైసెన్సులు రద్దు చేస్తామని పౌర సరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. బ్లాక్ మార్కెట్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
వారికి మంత్రి మాస్ వార్నింగ్
తెలంగాణ రాష్ట్రంలో డొమెస్టిక్ సిలిండర్ల కొరత లేదని కేవలం కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో మాత్రమే అంతరాయం ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండర్లను అధిక ధరలకు బ్లాక్ మార్కెట్లో విక్రయించే డీలర్లకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. గ్యాస్ సరఫరా పరిస్థితులపైన చీఫ్ సెక్రటరీ తోను, ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమై సమీక్షించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
డొమెస్టిక్ సిలిండర్లకు ఎటువంటి ఇబ్బంది లేదన్న మంత్రి
తెలంగాణ రాష్ట్రంలో 86% డొమెస్టిక్ సిలిండర్లు 14 శాతం కమర్షియల్ సిలిండర్ల సప్లై జరుగుతోందని, గృహ వినియోగానికి ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్లకు ఎటువంటి ఇబ్బంది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.వాణిజ్య సిలిండర్ల కొరతను అధిగమించడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. అక్రమ నిల్వలపైన నిఘా పెంచామన్నారు.
వారిపై కఠిన చర్యలకు వెనుకాడం అన్న మంత్రి
డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకునే వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గ్యాస్ ఏజెన్సీలు కస్టమర్లను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితులను ప్రభుత్వం గమనిస్తుందని, సాధారణ ప్రజలకు గ్యాస్ విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.


