Andhra Pradesh
oi-Sai Chaitanya
మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు (బుధవారం) నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజున గవర్నర్ ప్రసంగంతో సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశాలకు వైసీపీ హాజరు పైన కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. తాజాగా పార్టీ నేతలతో భేటీ సమయంలో జగన్ సభకు హాజరు పైన స్పష్టత ఇచ్చారు. జగన్ తో పాటుగా ఎమ్మెల్యేలు సభకు హాజరు కానున్నారు. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కాగా.. వైసీపీ ఇదే సమయంలో మరో ఆసక్తి కర నిర్ణయం తీసుకుంది.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపు (బుధవారం) ప్రారంభం కానున్నాయి. గవర్నర్ అబ్డుల్ నజీర్ ప్రసంగంతో సమావేశాలను ప్రారంభించనున్నారు. ఆ తరువాత బీఏసీ సమావేశంలో సభ నిర్వహణ.. అజెండా.. ఎన్ని రోజులు సమావేశాలు కొనసాగించాలనేది నిర్ణయించనున్నారు. కాగా, సమావేశాల తొలిరోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి హాజరు కావాలని మాజీ సీఎం జగన్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు మాజీ సీఎం హోదాలో జగన్ వాహనాన్ని అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతి పైన శాసనసభా వర్గాలను వైసీపీ నేతలు ఆరా తీసినట్టు తెలిసింది. ఇందుకు శాసనసభ వర్గాలు కూడా సుముఖతను వ్యక్తం చేసినట్టు సమాచారం. 2024 ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, గవర్నర్ ప్రసంగ కార్యక్రమాల కోసం అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చారు. ఆ తర్వాత నుంచి శాసనసభా సమావేశాలను బాయ్కాట్ చేస్తూ వస్తున్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
పార్టీ నేతలతో జగన్ కీలక సమావేశం
గవర్నర్ కు గౌరవం ఇచ్చేలా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని నిర్ణయించారు. ఎన్నికల్లో ఓడిన తరువాత గవర్నర్ ప్రసంగానికి మాత్రం హాజరు అవుతున్నారు. గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నిరసనకు దిగే అవకాశం కనిపిస్తోంది. తమ పార్టీ నేతల ఇళ్ల పైన జరిగిన దాడుల పైన నిరసనకు దిగాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశం తరువాత పార్టీ ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలతో జగన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణ పైన దిశా నిర్దేశం చేయనున్నారు. కాగా.. ఎమ్మెల్యేల గైర్హాజరు పైన కూటమి నేతలు వరుసగా విమర్శలు చేస్తున్నారు. సభకు హాజరు కాకుండానే జీత భత్యాలు తీసుకొంటున్నారని.. వారి పైన చర్యలు తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు ప్రభుత్వం పైన రాజకీయం గానూ ఒత్తిడి పెంచే వ్యూహాలతో జగన్ సిద్దం అవుతున్నట్లు సమాచారం. దీంతో.. పార్టీ నేతల సమావేశంలో జగన్ ప్రకటించే నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.


