Andhra Pradesh
oi-Chandrasekhar Rao
ఈ నెల 26 నుండి మార్చి 2వ తేదీ వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్నాయి. వీటి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. పద్మావతి అతిథి భవనంలో జరగిన ఈ సమావేశానికి టీటీడీలోని వివిధ విభాగాల అధికారులు హాజరయ్యారు. తెప్పోత్సవాలకు తరలివచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు.
ఈ నెల 23న తెప్పల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ట్రయల్ రన్ నిర్వహిస్తారు. వీటిని తిలకించడానికి వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఇబ్బందులు లేకుండా వరహా స్వామి ఆలయం, నాలుగు మాడ వీధుల్లో పందిళ్లను వేస్తారు. భక్తులకు సూచనలు ఇవ్వడానికి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అమర్చుతారు. ఈ నెల 20 నుండి మార్చి 5వ తేది వరకు పుష్కరిణీలో స్నానం చేయడానికి భక్తులకు అనుమతి ఉండదు. ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో అవసరమైన సెక్యూరిటీ సిబ్బందిని మోహరిస్తారు. పుష్కరిణీలో గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారు.
తెప్పోత్సవాలు ప్రాశస్త్యాన్ని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా వినిపిస్తారు. ఈ ఉత్సవాల కారణంగా ఈ నెల 26, 27 తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, 28న, మార్చి 1, 2వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. అదే సమయంలో అదనపు ఈవో మార్చి 3న జరగనున్న కుమారధార తీర్థ ముక్కోటిపై సమీక్షించారు.
మార్చి 3న తెల్లవారు జామున 5 నుండి 10 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారు. చంద్ర గ్రహణం కారణంగా ఉదయం 9 గంటలపైన భక్తులకు అన్న ప్రసాదాల పంపిణీ ఉండదు. తదనుగుణంగా భక్తులు తమ ప్రణాళికలను రూపొందించుకుని తిరుమలకు రావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది.
అనంతరం అదనపు ఈవో చంద్ర గ్రహణం రోజున చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. మార్చి 3న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7.30 గంటల వరకు చంద్ర గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత పడనుంది. మధ్యాహ్నం 3.20 నుండి సాయంత్రం 6.47 వరకు చంద్ర గ్రహణం ఉంటుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, రామ్ భగీచా, సీఆర్వోల వద్ద భక్తులకు దాదాపు 40 వేల పులిహోర ప్యాకెట్ల పంపిణీకి ఏర్పాట్లు.
ఆ రోజున అన్ని రకాల ఆర్జితసేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దయ్యాయి. చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీ మంగళవారం అష్టదళ పాద పద్మారాధన సేవను, కళ్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు. వీటితో పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి దర్శనాలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులు, దాతలు, ఎన్ఆర్ఐ దర్శనాలు రద్దు.


