Andhra Pradesh
oi-Sai Chaitanya
రాష్ట్రంలో రాజకీయ వివాదంగా మారిన కల్తీ నెయ్యి వ్యవహారం పై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ నేతలు ఇందాపూర్ – హెరిటేజ్ వ్యాపార సంబంధాల పైన చేస్తున్న ఆరోపణల పైన స్పందించారు. ఈ విమర్శలకు స్పష్టత ఇచ్చారు. పార్టీలో వ్యవహారాల పైన లోకేష్ తన ప్రణాళికలను వెల్లడించారు. మండలిలో వైసీపీ సభ్యుల డిమాండ్ పైన తేల్చి చెప్పారు. జగన్ త పైన చేసిన క్రికెట్ మ్యాచ్ లపైన స్పందించి… ఇండియా ఫైనల్ కు వస్తే ఆ మ్యాచ్ కు వెళ్తానని లోకేష్ వెల్లడించారు.
మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. చిట్చాట్లో అనేక అంశాల పై స్పందించారు. పార్టీ లో జూనియర్లు-సీనియర్లు మధ్య పూర్తి స్థాయి సమన్వయం ఉందని స్పష్టం చేశారు. పార్టీ సంస్థా గతంగా బలోపేతం కావాలంటే ప్రతి ఒక్కరూ తమ బూత్లో మెజారిటీ తెచ్చే దిశగా పనిచేయాలని స్పష్టం చేసారు. తన తో సహా అందరూ బూత్ విజయంపైనే దృష్టి పెట్టాలని… అప్పుడు మాత్రమే పార్టీ బలపడుతుందని పేర్కొన్నారు. నెయ్యి ధరలపై జరుగుతున్న ఆరోపణలను ఆయన ఖండించారు. కిలో నెయ్యి ₹360కి ఎక్కడ దొరుకుతుందో చూపించాలని సవాల్ చేశారు. సాధారణంగా మార్కెట్లో కిలో నెయ్యి ధర వెయ్యి రూపాయల పైనే ఉంటుందని, అంత తక్కువ ధరకు దొరికితే అది కల్తీ నెయ్యి అయ్యే అవకాశం ఉందన్నారు. ఇందపూరు డెయిరీకి హెరిటేజ్కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇందపూరు డెయిరీ కేవలం హెరిటేజ్కు ప్యాకర్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. అదే విధంగా వైసీపీ నేత బొత్సా సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన లోకేష్, కో-కంపెనీ అనే పదానికి అర్థం తెలియకుండా మాట్లాడటం సరికాదన్నారు.
ఫైనల్ మ్యాచ్ చూడటానికి వెళ్తాను.. జగన్ ను తీసుకెళ్తాను
హెరిటేజ్ ఒక లిస్టెడ్ కంపెనీ అని.. తమ మీద సెబీకి కూడా ఫిర్యాదు చేశారన్నారు. అయితే ఏమైనా ఆధారాలు ఇచ్చారా? నిరూపించారా.. అని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో సాక్షి, భారతి సిమెంట్స్ వంటి సంస్థలకు ప్రభుత్వం నుంచి వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని ఆరోపించారు. తమ కుటుంబం మాత్రం ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. క్రికెట్ మ్యాచ్ లకు వెళ్లటం పైన స్పందించారు. టీ20 ప్రపంచ కప్ లో భారత్ ఫైనల్స్కు వెళ్తే మ్యాచ్ చూడటానికి తప్పనిసరిగా వెళ్తానన్నారు. అవసరమైతే పులివెందుల ఎమ్మెల్యే రావాలన్నా ఆయనే టికెట్ తీసుకుంటానని సరదాగా వ్యాఖ్యానించారు. మండలి జరగాలని కోరుకున్నవారే నాలుగు రోజులు సభను అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పుడు బడ్జెట్పై చర్చ కావాలని వైసీపీ సభ్యులు అడగడం ఆశ్చర్యకరమన్నారు. సభలను అడ్డుకున్నప్పుడు ఈ విషయం వారికి గుర్తుకురాలేదా అని విమర్శించారు. ‘యువగళం’ సమయంలో తాను అందరినీ కలిసేవాడినని, మధ్యలో రెండు సంవత్సరాల గ్యాప్ వచ్చిందన్నారు. అందుకే మళ్లీ అందరినీ ఆహ్వానించి కుటుంబాలతో భేటీ అవుతున్నానని తెలిపారు. ఈ సమావేశాల్లో రాజకీయాలపై చర్చించట్లేదని, పూర్తిగా ఆత్మీయంగా జరుగుతున్న సమావేశాలేనని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.


