Telangana
oi-Sai Chaitanya
ఇందిరమ్మ లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. పెండింగ్ బకాయిల విడుదల పైన నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా బకాయిల కోసం వేచి చేస్తున్న లబ్ది దారులకు రిలీఫ్ దక్కింది. తాజాగా విడుదల చేసిన నిధుల ద్వారా తొలి దశలో 2,764 మంది లబ్ది దారుల కు ప్రయోజనం కలగనుంది. మిగిలిన బిల్లుల విషయంలోనూ ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని తాజాగా ప్రకటించింది.
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇళ్లు మంజూరై నిర్మాణంలో ఉన్న లబ్దిదారులకు తాజాగా నిధులు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెండింగ్ బిల్లులను చెల్లించింది. వీటిని నేరుగా లబ్దిదారుల అకౌంట్లో జమ చేసింది. మొత్తం 2,764 మంది లబ్దిదారులకు రూ.28.50 కోట్లు మంజూరు చేసింది. 99 రోజుల కార్యక్రమాన్ని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం ప్రారంభించిన వారం రోజుల్లో లబ్దిదారు లకు నిధులు విడుదల చేసింది. లబ్దిదారులకు సకాలంలో బిల్లులు చెల్లించినట్లు హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గౌతం ప్రకటించారు. ఇదే సమయంలో పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ చేసింది. క్లియర్ చేసేందుకు చర్యలు చేపడుతోంది.
దశల వారీగా చెల్లింపులకు సమాయత్తం
ప్రభుత్వం బిల్లుల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలతో ఇళ్ల నిర్మాణాలు మరింతగా వేగం పెరిగే అవకాశం కనిపిస్తోంది. సాంకేతిక సమస్యల వల్ల డబ్బలు జమ కాని లబ్దిదారులకు కూడా అందించేందకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ చేపడుతోంది. గత వారం రోజుల్లో ఎల్-3 జాబితాలో ఉన్న 1200 మందికి రూ.12.06 కోట్లు విడుదల చేశారు. ఇక బ్యాంక్ వద్ద పెండింగ్లో ఉన్న 653 మందికి కూడా రూ.7 కోట్లు విడుదల చేశారు. ఇక అభ్యంతరాల తర్వాత పెండింగ్లో పడ్డ 911 మంది లబ్దిదారులకు కూడా రూ.9.40 కోట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, తొలి విడతలో 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. ఇక రెండో విడత జాబితాను త్వరలో విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏప్రిల్ లో రెండో విడత జాబితా కింద మరికొంతమందిని ఇళ్లను మంజూరు చేయనున్నట్లు తాజాగా ప్రభుత్వం వెల్లడించింది.


