International
oi-Chandrasekhar Rao
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధి గుండా సురక్షిత రవాణా ప్రయత్నాలకు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ సిద్ధంగా ఉన్నామని ప్రకటించాయి. ఈ మేరకు ఓ జాయింట్ స్టేట్ మెంట్ విడుదల చేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన వ్యవస్థను స్థిరీకరించడంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటామని వెల్లడించాయి. ఈ విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ తో కలిసి పని చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశాయి.
ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు కఠిన హెచ్చరిక జారీ చేశారు. హార్ముజ్ జలసంధిని 48 గంటల్లోపు తిరిగి తెరవకపోతే విద్యుత్ కేంద్రాలపై సైనిక చర్యకు దిగుతామని స్పష్టం చేశారు. ట్రూత్ సోషల్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. 48 గంటల్లోగా ఇరాన్ హార్ముజ్ జలసంధిని పునరుద్ధరించాల్సి ఉంటుందని అల్టిమేటం ఇచ్చారు. అలా చేయకపోతే ఇరాన్ లో ఏ ఒక్క విద్యుత్ కేంద్రాన్ని కూడా ఉండనివ్వబోమని, అన్నింటినీ పేల్చివేస్తామని అన్నారు.
ఈ సమయం ఈ క్షణం నుండే ఆరంభమైందనీ తెలిపారు. ఇప్పటి నుండి 48 గంటల్లోగా ఇరాన్ ఎటువంటి బెదిరింపులకు పాల్పడకుండా నేరుగా హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవాల్సి ఉంటుందని ట్రంప్ తేల్చి చెప్పారు. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడి ప్రారంభమైనప్పటి నుండి ఆ దేశ సైన్యం ఈ జలసంధిని దిగ్బంధించిన విషయం తెలిసిందే. కీలకమైన ఈ మార్గం మూసివేత వ్యవహారం ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిణామాల మధ్యే ట్రంప్ ఈ హెచ్చరిక జారీ చేశారు.
దీనికి ఇరాన్ సైన్యం బదులిచ్చింది. ఖాతమ్ అల్-యాంబియా ఆపరేషనల్ కమాండ్ ఒక ప్రకటన విడుదల చేసింది. శత్రువులు ఇరాన్ ఇంధన, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలపై దాడులకు పాల్పడితే తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ రీజియన్ లోని అమెరికా, ఆ దేశానికి సహకరిస్తోన్న అన్ని ప్రాంతీయ శక్తులకు చెందిన సమాచార సాంకేతికత, ఉప్పునీటిని శుద్ధి చేసే మౌలిక సదుపాయాలు లక్ష్యంగా చేసుకుంటామని తెలిపింది.
ఇరాన్తో చర్చలకు తాను ఎంతమాత్రం ఆసక్తిగా లేనని ట్రంప్ ఇదివరకే వ్యాఖ్యానించారు. ఆ తర్వాతే తాజా హెచ్చరికలు జారీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. యుద్ధం తీవ్రతను మరింత పెంచినట్టయింది. హార్ముజ్ జలసంధిపై ఎక్కువగా ఆధారపడిన ఇతర దేశాలు దాని భద్రత బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుందని ట్రంప్ గతంలో పిలుపునిచ్చారు. ఇరాన్ ముప్పు తొలగించేంత వరకే తమ బాధ్యత అని పేర్కొన్నారు.


