Andhra Pradesh
oi-Sai Chaitanya
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన హామీ అమలుకు సిద్దమైంది. ఈ మేరకు మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఇప్పటికే మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత బస్సు స్కీం కు ఆదరణ పెరుగుతోంది. ఇదే సమయంలో దివ్యాంగులకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసింది. ఇందు కోసం పాస్ లు జారీ చేయనుంది.
ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం రేపు (బుధవారం) నుంచి అమల్లోకి రానుంది. ఈ పథకానికి దివ్యాంగ శక్తిగా పేరు ఖరారు చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు లో ఈ పథకం ప్రారంభించనున్నారు. డిసెంబరు 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు వారికి ఇంద్రధనస్సు పేరిట ఆరు పథకాలు ప్రకటించారు. అందులో ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కూడా ఒకటి. ప్రస్తుతం దివ్యాంగుల కు మెట్రో ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, నాన్ స్టాప్, అంతర్రాష్ట్ర (ఇంటర్స్టేట్), సప్తగిరి ఎక్స్ప్రెస్ (తిరుమల ఘాట్లో తిరిగేవి), అల్ట్రా డీలక్స్ బస్సు సర్వీసుల్లోని టికెట్ ఛార్జీలో 50 శాతం రాయితీ ఇస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోని సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం ఉంది. తాజా ఉత్తర్వు నేపథ్యంలో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా దివ్యాంగుల ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తారు.
పాస్ లు జారీ.. తాజా మార్గదర్శకాలు
కాగా, మిగిలిన నాన్స్టాప్, సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఇప్పుడున్నట్లే 50 శాతం రాయితీ కొనసాగుతుంది. రాష్ట్రంలో 11 లక్షల మంది దివ్యాంగులు ఉన్నట్లు సంబంధిత శాఖ అధికారులు ఆర్టీసీకి వివరాలు అందజేశారు. ఈ కొత్త పథకం లబ్ది దారులకు ఆర్టీసీ ఈ రోజు పాస్ లు జారీ చేయనుంది. కొత్తగా పాస్ తీసుకునే వారు ఆధార్ తో పాటుగా గుర్తింపు పత్రం అవసరం. మొబైల్ యాప్ ద్వారానూ డిజిట్ పాస్ పొందవచ్చని అధికారులు వెల్లడించారు. ఆర్టీసీ మొబైల్ యాప్ లో సదరం ఐడీ నమోదు చేసుకోవటం ద్వారానూ ఈ పాస్ కోసం నామ మాత్రపు చెల్లంపు చేసి పొందే అవకాశం కల్పించారు. వాట్సప్ గవర్నెన్స్ లోనూ పాస్ జారీ చేస్తున్నారు. 40 అంతకంటే ఎక్కువ వైకల్య శాతం ఉన్న వారికి దివ్యాంగ శక్తి పథకం వర్తించేలా పాస్ జారీ చేస్తున్నారు. 60 శాతానికి పైగా ఉన్న వారికి ఎస్కార్టను అనుమతిస్తూ నిర్ణయించారు. ఎస్కార్టుకు 50 శాతం రాయితీ అమలు చేస్తారు.


