Telangana
oi-Syed Ahmed
తెలంగాణ (Telangana)లో ఉద్యోగులు, పెన్షనర్లకు రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు ప్రభుత్వం నుంచి అందే వైద్య సాయం విషయంలో కొత్త విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో ఉద్యోగులు, పెన్షనర్లకు అపరిమిత వైద్య సాయం అందబోతోంది. దీంతో ఇకపై వారంతా నెట్ వర్క్ ఆస్పత్రుల్లో పడుతున్న ఇబ్బందులకు చెక్ పడబోతోంది.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉద్యోగులు, పెన్షనర్లకు అమలవుతున్న హెల్త్ పాలసీలో లోపాల్ని సవరించి కొత్త విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఎంప్యానల్ చేసిన నెట్ వర్క్ ఆస్పత్రుల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు అపరిమిత వైద్య సదుపాయాలు అందబోతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం వారి జీతం లేదా పెన్షన్లలో ఉన్న మూలవేతనంలో 1.5 శాతాన్ని ప్రీమియంగా తీసుకుంటుంది. దీనికి ప్రభుత్వం మరో 1.5శాతం మొత్తం జమ చేస్తుంది.
అలా వెయ్యి కోట్లు ప్రీమియంగా చెల్లించి ఈ కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ ఉద్యోగులతో పాటు మోడల్ స్కూల్స్, గురుకులాల సిబ్బందినీ ఈ కొత్త విధానం పరిధిలోకి తీసుకొస్తారు. అలాగే దీని విధివిధానాల ఖరారుకు త్వరలోనే కమిటీ కూడా నియమించబోతోంది. ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా కొత్త హెల్త్ పాలసీని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.


