Andhra Pradesh
oi-Sai Chaitanya
మహిళా రిజర్వేషన్ల పైన కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గాల పునర్విభజన కంటే ముందే ఈ నిర్ణయం అమలుచేయాలని డిసైడ్ అయింది. ఈ మేరకు 2023లో పార్లమెంట్ ఆమోదించిన చట్టంలో సవరణలు చేయాలని భావిస్తోంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యంగా.. ప్రస్తుత సమావేశాల్లోనే రాజ్యాంగ సవరణకు సిద్దం అయింది. దీంతో.. ఏపీ- తెలంగాణ లోని రెండు రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ మహిళలకు సీట్లు పెరగ నున్నాయి. ఈ మేరకు ప్రస్తుత లెక్కల పైన స్పష్టత వస్తోంది.
మహిళా రిజర్వేషన్ల పైన బడ్జెట్ మలి విడత సమావేశాల్లో రాజ్యాంగ సవరణ ద్వారా అమలుచేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. నియోజకవర్గాల పునర్విభజన కంటే ముందే మహిళా రిజర్వేషన్ చట్టం అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 2వ తేదీ వరకూ జరగనున్న బడ్జెట్ మలి విడత సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. జనగణన, పునర్విభజన ప్రక్రియ కోసం వేచి చూడకుండానే కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. రాజ్యాంగ సవరణ ద్వారా అమలు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే చట్ట సభల్లో మహిళా సభ్యుల సంఖ్య 180 స్థానాలకు పెరుగుతుందని చెబుతున్నారు. ఇకపై చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది. ఇక రాజ్యసభలో మొత్తం 224 ఎంపీలు ఉన్నారు. వీరిలో 24 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. అంటే ప్రస్తుతం మహిళా ఎంపీల శాతం 11 శాతంగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో అమలు ఇలా
మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రకారం ఇక అసెంబ్లీ, లోక్సభలో తప్పనిసరిగా 33 శాతం సీట్లు మహిళలకే కేటాయించాలి. ఈ చట్టం అమల్లోకి వస్తే తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లు ఉండటం తో.. వీటిలో సుమారు 40 సీట్లు మహిళలకు వస్తాయి. అలాగే తెలంగాణలో 17 లోక్సభ సీట్లు అంటే సుమారు 5- 6 సీట్లు మహిళలకు వస్తాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వీటిలో… సుమారు 57 – 58 సీట్లు మహిళలకు దక్కనున్నాయి. ఏపీలో 25 లోక్ సభ సీట్లు అంటే సుమారు 8 సీట్లు మహిళలకు కేటాయించే అవకాశం ఉంది. అయితే.. నియోజకవర్గ పునర్విభజన జరిగితే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 స్థానాలు మరో 34 పెరిగి 153 స్థానాలు అవుతాయి. అదే విధంగా ఏపీలో 50 సీట్లు పెరిగి 225 కి చేరుతాయి. పెరిగిన లెక్కల మేరకు మహిళల రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పైన నిర్ణయం జరిగినా.. ఆలస్యం అయినా.. మహిళలకు రిజర్వేషన్.. సీట్ల ఖరారు మాత్రం ఇక నుంచి జరిగే అన్ని ఎన్నికల్లోనూ అమలయ్యేలా కేంద్రం కొత్త చట్టం అమల్లోకి తెచ్చేందుకు తుది కసరత్తు చేస్తోంది.


