Telangana
oi-Dr Veena Srinivas
రాష్ట్రంలో ఇటీవల ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు ముగిశాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో ఘన విజయం సాధించి దూసుకుపోయింది. 80 శాతానికి పైగా స్థానాలను గెలుచుకొని మంచి విజయోత్సాహంతో పార్టీ శ్రేణులు ఉన్నారు. అయితే ఇదే సమయంలో mptc, zptc ఎన్నికలను కూడా త్వరగా నిర్వహించాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. కానీ ఈ అంశం పైన రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై అప్డేట్
తాజాగా రేవంత్ రెడ్డి చెప్పిన విషయాన్ని బట్టి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. క్యాబినెట్ భేటీలో ఈ అంశం చర్చకు రాగా బీసీ రిజర్వేషన్ల బిల్లు కేంద్రానికి పంపిన కారణంగా దానిపైన కేంద్ర నిర్ణయం కోసం వేచి చూద్దామని సీఎం రేవంత్ మంత్రులతో పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాతే ఎలక్షన్లకు వెళదామని సీఎం రేవంత్ చెప్పినట్టు సమాచారం.
బీసీ రిజర్వేషన్ ల అంశం కేంద్రం తేల్చాకే ఎన్నికలు
రేవంత్ ఆలోచన మేరకు ఈ విషయంపైన మంత్రులు కూడా సానుకూలంగానే స్పందించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో బిల్లు ఆమోదించి దాన్ని కేంద్రానికి పంపింది. ప్రస్తుతం ఆ బిల్లు కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది. దీనిపైన కేంద్రం నిర్ణయం తర్వాత ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. ఇక ఈ క్రమంలోనే నిన్న జరిగిన క్యాబినెట్ భేటీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై రేవంత్ ఆలోచన ఇలా
రేవంత్ రెడ్డి చెప్పిన మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో లేవని స్పష్టం అవుతుంది. ఇదిలా ఉంటే మే 3వ తేదీ నుంచి జూన్ రెండవ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిని, సంక్షేమ పథకాల అమలును నివేదికలుగా తయారుచేసి ప్రజల వద్దకు వెళ్లాలని, సమస్యలను పరిష్కరించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది.


