Andhra Pradesh
oi-Dr Veena Srinivas
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ఎండాకాలంలో నిప్పుల కొలిమిని తలపిస్తుంది. ఒకపక్కన ఎండల తీవ్రత పెరుగుతూ ఉంటే మరోవైపు నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణం చోటు చేసుకుంది. ఏపీలో ఈరోజు ఉదయం వేళ దట్టమైన పొగ మంచు అనేక ప్రాంతాలలో ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. తీవ్రమైన చలికాలంలో వచ్చినట్టు దట్టమైన పొగ మంచు రావడంతో మారుతున్న వాతావరణంపై ప్రజలు ఆసక్తికర చర్చ చేస్తున్నారు.
పొగమంచుతో వాహనదారులకు అసౌకర్యం
ముఖ్యంగా ఈరోజు గోదావరి జిల్లాలలో దట్టమైన పొగ మంచు కురవడం వాహనదారులకు ఇబ్బంది కలిగించింది.గోదావరి నదిపై ఉన్న రోడ్డు కం రైల్వే బ్రిడ్జి, హేవలక్ బ్రిడ్జ్, ఆర్చి బ్రిడ్జి పొగమంచుతో పూర్తిగా కప్పబడిపోవడంతో వాహనదారులు అసౌకర్యానికి గురయ్యారు. గోదావరి బండ్ పై వాకింగ్ చేసేవారు, గోదావరి ఘాట్ లకు వెళ్లే భక్తులు ఆ అరుదైన దృశ్యాలను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.
ఏపీలో చల్లబడిన వాతావరణం
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలలో ఆకస్మికంగా మార్పులు వచ్చాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అనుకూల పరిస్థితుల కారణంగా తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గి చల్లని వాతావరణం ఉంటుందని పేర్కొంది.
కోస్తాంధ్ర జిల్లాలలో తేలికపాటి వర్షాలు
నేడు ఏపీలో పలు ప్రాంతాలలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. విశాఖ పట్నం, కాకినాడ, నెల్లూరు వంటి తీర ప్రాంతాల జిల్లాలపై ద్రోణి ప్రభావం అధికంగా ఉండనుంది.
బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు
ఈ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల నేపధ్యంలో రైతులు ముఖ్యంగా పంటల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది.


