Andhra Pradesh
oi-Dr Veena Srinivas
కర్నూలు యువత పురోగతికి బాటలు వేసే ప్రాజెక్టు పైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుభవార్త చెప్పారు. కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీకి సంబంధించిన పెండింగ్ పనులను రాబోయే విద్యా సంవత్సరంలోగా పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. శాసనసభలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఈ ప్రకటన సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన విద్య ప్రాజెక్టుపైన మళ్లీ ఆశలు రేకెత్తించింది.
కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీపై ఎమ్మెల్యే ప్రశ్న
శాసనసభలో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి రాష్ట్ర విభజన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కర్నూలులో సిల్వర్ జూబ్లీ, కేవీఆర్ విమెన్స్ డిగ్రీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలను కలిపి క్లస్టర్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేశారని అయితే గత వైసిపి ప్రభుత్వం ఈ క్లస్టర్ యూనివర్సిటీ ప్రాజెక్టును నిర్వీర్యం చేసిందని ఆమె ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన పనులతో యూనివర్సిటీ నిర్మాణ పనులు నిలిచిపోయాయన్నారు.
సభలో కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీపై మాట్లాడిన మంత్రి లోకేష్
దీంతో యూనివర్సిటీ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యూనివర్సిటీ కి సంబంధించి ప్రభుత్వ విధానాన్ని ప్రకటించాలని ఆమె శాసనసభ వేదికగా కోరారు.దీనికి సమాధానం ఇచ్చిన మంత్రి నారా లోకేష్ ఈ క్లస్టర్ యూనివర్సిటీ ప్రాజెక్ట్ కోసం గతంలోనే టిడిపి ప్రభుత్వం 139 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని రూసా పథకం కింద ఇప్పటికే 55 కోట్ల రూపాయలను ఖర్చు చేశామని మంత్రి లోకేష్ వెల్లడించారు.
క్లస్టర్ బేస్ అప్రోచ్ ప్రభుత్వ విధానం
మిగిలిన పనుల పూర్తికి మరో 74.5 కోట్ల రూపాయల అవసరమని పేర్కొన్న ఆయన వీటిని వచ్చే విద్యా సంవత్సరంలోగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టిన క్లస్టర్ బేస్ అప్రోచ్ ని అనుసరిస్తుందని మంత్రి లోకేష్ శాసనసభ వేదికగా వెల్లడించారు. దీనికోసం వర్టికల్, హారిజంటల్ ఇంటిగ్రేషన్ అవసరమని అందుకు తగిన ఎకో సిస్టమ్ ను సృష్టించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
కూటమి పాలనలో రాయలసీమ ప్రగతి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ జిల్లాలలో పెరిగాయని వీటితో పాటు స్పెషలైజేషన్ కోసమే ఈ క్లస్టర్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీ కోసం గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో సిల్వర్ జూబ్లీ కె.వి.ఆర్ ఉమెన్స్ డిగ్రీ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలను కలిపి క్లస్టర్ యూనివర్సిటీ గా ఏర్పాటు చేశారు.
మంత్రి ప్రకటనతో చిగురించిన ఆశలు
రూసా పథకం కింద 55 కోట్ల రూపాయలను మంజూరు చేసి నిర్మాణాలను చేపట్టారు. జగన్నాథ గట్టు పక్కన 50 ఎకరాలలో భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఎం ఎస్ వైరాలజీ, కెమికల్ టెక్నాలజీ, ఎంసీఏ వంటి కోర్సులను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టులు పడకేసింది. మళ్లీ ఇప్పుడు మంత్రి నారా లోకేష్ ప్రకటనతో ఈ ప్రాజెక్టు పైన కర్నూలు వాసులకు ఆశలు చిగురించాయి.


