Andhra Pradesh
oi-Sai Chaitanya
ఏపీలో లడ్డూ వ్యవహారం పతాక స్థాయికి చేరింది. సిట్ ఛార్జ్ షీట్ పైన రాజకీయ ప్రకంపనలు కొన సాగుతున్నాయి. శాసన మండలి వారం రోజులుగా ఇదే అంశం పైన హోరెత్తుతోంది. ప్రభుత్వం తాజాగా లడ్డూ వివాదం పైన ఏక సభ్య కమిషన్ నియమించింది. ఈ నియామకం పైన సుప్రీం కోర్టు లో సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన పిటీషన్ ఈ రోజు విచారణకు రానుంది. కాగా.. ఈ సమయం లోనే కూటమి ప్రభుత్వం ఈ వివాదం పైన కొత్త వ్యూహం అమలు చేసేందుకు సిద్దమైంది. దీంతో.. అటు మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
సంచలనంగా మారిన లడ్డూ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిటీ పైన సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన పిటీషన్ పైన ఈ రోజు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి బెంచ్ విచారణ చేయనుంది. ఇదే సమయంలో ఈ వివాదం రాజకీయంగా పతాక స్థాయికి చేరటం తో అసెంబ్లీ వేదికగా చర్చించి… అన్ని అంశాలను ప్రజల ముందు ఉంచాలని కూటమి నేతలు భావిస్తున్నారు. వారం రోజులుగా మండలిలో నెయ్యి సరఫరా.. ఇందాపూర్ వ్యవహారం పైన వైసీపీ నేతలు చర్చకు పట్టు బడుతున్నారు. ఈ క్రమంలో నిరసనలో భాగంగా చెప్పులు, బూట్లు ధరించి శ్రీవారి చిత్రపటాలను పట్టుకుని మండలి వేదికగా వైసీపీ ఎమ్మెల్సీలు శ్రీవారిని కించపరిచేలా వైసీపీ నేతలు వ్యవహరించారని కూటమి ఆరోపిస్తోంది. అటు మాజీ సీఎం జగన్ ఇప్పటికే తిరుమలలో నెయ్యి సరఫరా టెండర్లు.. ఇందాపూర్ వ్యవహారం పైన కీలక అంశాలు వెల్లడించారు. ఈ సమయం లో ఉద్దేశపూర్వకంగా హెరిటేజ్ అంశాన్ని తెరపైకి తెచ్చి మండలిలో వైసీపీ రాద్దాంతం చేస్తోందనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. అక్కడ తమ వాణిని బలంగా వినిపించేందుకు ప్రయత్నిస్తున్నా.. వైసీపీ సభ్యులు బలప్రయోగంతో మండలిని తప్పుదారి పట్టిస్తున్నారని ఎన్డీయే కూటమి సభ్యులు అభిప్రాయపడుతున్నారు.
అసెంబ్లీలో చర్చ.. జగన్ హాజరు ఛాన్స్
ఈ నేపథ్యంలో కల్తీ నెయ్యి అంశంలో పూర్తి వివరాలను తెలియజేసేందుకు శాసనసభే సరైన వేదిక అని అధికార కూటమి భావిస్తోంది. ఇప్పటికే బడ్జెట్పై చర్చ ముగిసినందున కల్తీ నెయ్యి అంశాన్ని కూడా సభలో చర్చకు పెట్టాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ముందుగా శాసనసభలో చర్చించి తర్వాత అవసరాన్ని బట్టి మండలిలోనూ చర్చించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ వారంలో ఏదో ఒక రోజు కల్తీ నెయ్యి అంశంపై శాసనసభలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. కాగా.. ప్రభుత్వం తాజా వ్యూహాలపై తాజాగా జగన్ పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. మండలిలో చర్చ కోసం పట్టు బట్టాలని.. అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం సిద్దమైతే… తాను హాజరు అవుతానని జగన్ చెప్పినట్లు పార్టీ నేతల సమాచారం. ఈ అంశంలో ఎక్కడ అవకాశం వచ్చినా వదులుకోవద్దని.. ప్రభుత్వాన్ని నిలదీసే విషయంలో గట్టిగా ఉండాలని నిర్దేశించినట్లు తెలుస్తోంది. దీంతో.. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో కల్తీ నెయ్యి పైన చర్చకు సిద్దమైతే.. అసెంబ్లీ వేదికగా చోటు చేసుకునే వాదనలు.. వాస్తవాల పైన ఆసక్తి నెలకొంది.


