Telangana
oi-Lingareddy Gajjala
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాసం వద్ద ఒక్కసారిగా రాజకీయ అలజడి మొదలైంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమెకు సమన్లు ఇచ్చేందుకు సీబీఐ అధికారులు హైదరాబాద్లోని ఆమె నివాసానికి చేరుకున్నారు. ఇటీవల ఈ కేసులో కవితకు ఊరటనిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరుకావాలని కోరుతూ అధికారులు ఆమెకు నోటీసులు అందజేశారు.
ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ మోపిన అభియోగాలు నిరాధారంగా ఉన్నాయని, కవితపై సరైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ ఇటీవల రౌజ్ అవెన్యూ కోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు కవితకు పెద్ద ఊరటనిచ్చింది. అయితే, ఈ తీర్పును ప్రాథమిక దశలోనే కొట్టివేయడాన్ని తప్పుబడుతూ సీబీఐ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది.
సీబీఐ కేవలం కవితకే కాకుండా, ఈ కేసులో నిందితులుగా ఉన్న మరికొంత మందికి కూడా సమన్లు జారీ చేసింది. మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆడిటర్ బుచ్చిబాబు, రామచంద్ర పిళ్లే, అభిషేక్ బోయిన్ పల్లితో పాటు పలువురికి నోటీసులు అందజేసింది. ఈ నెల 16న డిల్లీ హైకోర్టులో విచారణకు హజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో ఢిల్లీ మద్యం కేసు వ్యవహారం మళ్లీ మొదటికి చేరినట్లు కనిపిస్తోంది.
హైకోర్టులో సీబీఐ చేసిన అప్పీల్ ఎలాంటి మలుపులు తిరుగుతుంది? మరోసారి విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందా? అనే అంశాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.


