International
oi-Bomma Shivakumar
ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సైన్యం దాడులు తీవ్రతరం అవుతున్నాయి. అటు ఇరాన్ సైతం దాడులను ఉద్ధృతం చేసింది. గత నాలుగు రోజులుగా దాడులు అంతకంతకు తీవ్రమవుతున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఖమేనీ కుటుంబంతో పాటు దాదాపు ఇరాన్ ప్రభుత్వంలోని అధికారులంతా హతం అయ్యారు. దాంతో ఇరు దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ పై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపిస్తోంది.
ఇక అమెరికా- ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ లో మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది. మార్చి 2 సోమవారం నాటికి 555 మంది ఇరాన్ లో ప్రాణాలు కోల్పోగా.. ఇప్పుడు ఆ సంఖ్య 787 కు చేరింది. ఈ విషయాన్ని ఇరాన్ స్టేట్ మీడియా స్పష్టం చేసింది. యుద్ధం తీవ్రతరం అవుతున్న క్రమంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అటు ఇరాన్ సైతం ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాలపై దాడులకు పాల్పడుతోంది. యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, సైప్రస్, ఇరాక్, జోర్డాన్ తదితర దేశాలపై దాడులు చేపడుతోంది.
అయితే ఇరాన్ తో దాడుల నేపథ్యంలో అమెరికా సైన్యం కూడా భారీగానే కుప్పకూలుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా మరో ఇద్దరు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా మిలిటరీ స్పష్టం చేసింది. దాంతో మొత్తం మృతి చెందిన అమెరికా సైనికుల సంఖ్య 6 కు చేరినట్లు పేర్కొంది. అయితే అనధికారికంగా చాలామందే మృతి చెంది ఉంటారని ఓ వాదన వినిపిస్తోంది. ఇక ఇరాన్ దాడులను తీవ్రతరం చేస్తున్న క్రమంలో మరింతమంది యూఎస్ సైనికులు హతం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధంలో ముగ్గురు భారతీయులు మృతిచెందారు. ఒమన్ తీరంలో ప్రయాణిస్తున్న రెండు వాణిజ్య నౌకలపై ఇరాన్ భీకర దాడులు జరిపింది. అయితే ఈ దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఒమన్ షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ అధికారికంగా పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇరాన్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై కాంగ్రెస్ సభ్యులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ నుంచి ఎలాంటి అనుఫైమతి లేకుండా ఇరాన్ పై మిలిటరీ యాక్షన్ కు దిగడంపై ఫైర్ అవుతున్నారు. ఈ మేరకు వార్ పవర్స్ రిజల్యూషన్ పై ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. వార్ పవర్స్ యాక్ట్ లో మార్పులు అవసరం అని అభిప్రాయపడుతున్నారు.


