Telangana
oi-Chandrasekhar Rao
భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనూహ్యంగా తెరమీదికి వచ్చారు. కేంద్రం ముందు మూడు ప్రతిపాదనలను ఉంచారు. దీనికి సంబంధించి సమగ్ర వివరాలతో కూడిన సుదీర్ఘ లేఖ రాశారాయన. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితులను కేంద్రానికి వివరించారు. క్షేత్రస్థాయి వాస్తవాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. తక్షణ జోక్యం అవసరమని, దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని అన్నారు.
వాణిజ్య, గృహావసరాలకు ఉపయోగించే ఎల్పీజీ వంటగ్యాస్ సరఫరాలో తలెత్తిన తీవ్ర అంతరాయంపై తక్షణ జోక్యం కోరుతూ ఈ లేఖను రాశారు కేటీఆర్. ఈ సిఫార్సులను వెంటనే పరిగణనలోకి తీసుకొని చర్యలు చేపట్టాలని కోరారు. వాణిజ్య సిలిండర్ల తీవ్ర కొరత ఒక పెద్ద సంక్షోభానికి దారితీసిందని, దీని పరిష్కారానికి మంత్రిత్వ శాఖ, అది ఏర్పాటు చేసిన కమిటీ తక్షణ, సమన్వయ జోక్యం అవసరమని కేటీఆర్ స్పష్టం చేశారు.
గృహ వినియోగానికి ప్రాధాన్యతనిస్తూ కేంద్రం నిత్యావసర వస్తువుల చట్టాన్ని అమలు చేయడాన్ని అంగీకరిస్తామని అన్నారు. అది అవసరమైన చర్యేనని పేర్కొన్నారు. ఈ నిర్ణయం వాణిజ్య ఆహార రంగంపై విపరీతమైన ప్రభావం చూపుతోందని, దీనికి అంతే నిర్ణయాత్మకమైన శ్రద్ధ అవసరమని పునరుద్ఘాటించారు. తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ హెచ్చరిక ప్రకారం, సరఫరా పునరుద్ధరించకపోతే హైదరాబాద్తో సహా తెలంగాణలోని దాదాపు 90 శాతం హోటళ్లు 48 గంటల్లో మూతపడే ప్రమాదం ఉందని అన్నారు.
పార్ట్ ఎ: సిఫార్సు 1: వాణిజ్య సంస్థల టైర్డ్ వర్గీకరణ, కేటాయింపులో భిన్నత్వం
అన్ని వాణిజ్య సంస్థలను ఒకే వర్గంగా చూడటం ఈ సంక్షోభంలో పెద్ద విధానపరమైన లోపమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. వందలాది అవుట్లెట్లు, ఆర్థిక నిల్వలున్న పెద్ద చైన్ రెస్టారెంట్లను.. రోజువారీ సంపాదనపై ఆధారపడే రోడ్డు పక్కన టీ స్టాల్తో సమానంగా చూడటం బాధ్యతారాహిత్యమని కేటీఆర్ అన్నారు. వీటిని వేరు చేస్తూ ఓ స్పష్టమైన టైర్డ్ ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేయాలని సూచించారు. చిన్నహోటల్ ఆపరేటర్లను ముందుగా రక్షించే విధంగా కేటాయింపు ప్రాధాన్యతలు రూపొందించాలని చెప్పారు.
రియల్ టైమ్ డాష్బోర్డ్
ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న భయాందోళనలు, నిల్వల కొనుగోలు కొరత కారణంగానే కాకుండా, పూర్తి అనిశ్చితి వల్లే జరుగుతోందని కేటీఆర్ వివరించారు. తదుపరి సిలిండర్ ఎప్పుడు వస్తుందో తెలియకపోవడంతో, వ్యాపార యజమానులు ఎక్కువ స్టాక్ చేసుకోవడం సహజమేనని, సమాచార లోపం కారణంగా అనవసరమైన బుకింగ్లు పెరిగాయని, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే రియల్ టైమ్, జిల్లా స్థాయి పంపిణీ, నిల్వ డేటాను కలిగి ఉన్నాయని గుర్తుచేశారు.
ఈ డేటా సరళీకృత వెర్షన్ను ప్రజలకు అందుబాటులో ఉంచేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించాలని కేటీఆర్ సూచించారు. నగరాలు, జిల్లా క్లస్టర్ల వారీగా వాణిజ్య సిలిండర్ సరఫరా అంచనా తేదీలను ప్రతిరోజూ ప్రదర్శించే డాష్బోర్డ్ను రూపొందించాలని కోరారు. దీనివల్ల వ్యాపారాలు తమ కార్యకలాపాలను ప్రణాళిక చేసుకోవడానికి, అనవసరమైన ఓవర్ బుకింగ్ను తగ్గించడానికి, ప్రస్తుత అనిశ్చితిలో పనిచేస్తున్న పరిశ్రమకు విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి సహాయపడుతుందని చెప్పారు.
వాణిజ్య సిలిండర్లపై ధరల నియంత్రణ
సరఫరా పడిపోయినప్పటికీ, వాణిజ్య సిలిండర్ల ధరలు పెరిగాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. వీటి ధరలను స్తంభింపజేయాలని చెప్పారు. ఓఎంసీలపై వ్యయ ఒత్తిడి ఉంటే, ప్రభుత్వం ఆ ఖర్చులో కొంత భాగాన్ని భరించాలని సూచించారు. ప్రపంచ సరఫరా అంతరాయం భారం పౌరులు, చిన్న వ్యాపార యజమానులపై బదిలీ కాకూడదని స్పష్టం చేశారు.
సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు తరలుతున్నాయని, అనేక నగరాల్లో, గృహ వినియోగ సిలిండర్లను అక్రమంగా మళ్లించి, అధికారిక ధర కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ ధరకు వాణిజ్యపరంగా విక్రయిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. బ్లాక్ మార్కెట్ కు మళ్లించిన ప్రతి సిలిండర్.. చట్టబద్ధంగా అవసరం అయ్యే గృహానికి లేదా చిన్న వ్యాపారానికి లభించడం లేదని హెచ్చరించారు. ఐటీ, ఆర్థికం, బ్యాక్ ఆఫీస్ రంగ యజమానులకు 30 రోజుల పాటు కనీసం 50 శాతం వర్క్ ఫ్రమ్ ఇచ్చేలా ఆదేశించాలని చెప్పారు.


