Andhra Pradesh
oi-Sai Chaitanya
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న కొత్త పెన్షన్ల మంజూరు పైన కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన స్పౌజ్ కేటగిరి (భర్త చనిపోయిన భార్యకు) పింఛన్ విధానాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోంది. అదే విధంగా కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా ఎవరికీ పెన్షన్లు మంజూరు చేయలేదనే వాదన ఉంది. దీంతో, ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త పెన్షన్ల మంజూరు.. పంపిణీ దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దరఖాస్తుల స్వీకరణ పైన అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు.
ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరు పైన ఫోకస్ చేసింది. ఇప్పటికే అనేక మంది కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేయగా.. ప్రభుత్వం ఇంకా మంజూరు చేయలేదు. ప్రస్తుత కొత్త పింఛన్లను హోల్డ్ లో పెట్టింది. దీంతో దరఖాస్తు దారులు పెద్ద సంఖ్యలో నిరీక్షిస్తున్నారు. కొత్త పెన్షన్ల జారీలో జాప్యం చేస్తుండగా.. ఇప్పుడు దీనిపై క్లారిటీ వచ్చింది. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసింది. రాష్ట్రంలో అర్హులైన వారికి వృద్దాప్య, వితంతు కొత్త పించన్ల మంజూరుకు ఇప్పటికే మార్గదర్శకాలు రూపొందించామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. త్వరలోనే దరఖాస్తులు కూడా తీసుకుంటామన్నారు. కొత్తగా పించన్ కోసం అప్లై చేసుకునేందుకు త్వరలోనే అవకాశం కల్పిస్తామని అన్నారు. అర్హులైన ప్రతిఒక్కరూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క పింఛన్ కూడా ఇప్పటివరకు తొలగించలేదని, ఇంకా ఎక్కువమందికి అందించే ప్రక్రియ త్వరలో చేపడతామన్నారు. అదే విధంగా పెన్షన్ల తొలిగింపు ప్రచారం వేళ… ఈ విషయంలోనూ స్పష్టత ఇచ్చారు.
ప్రభుత్వం కొత్త పెన్షన్ల పై కసరత్తు
2024 లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల్లో ఒక్క వ్యక్తి పింఛన్ కూడా తొలగించలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం నిలిపివేసిన స్పాజ్ కేటగిరీ పింఛన్ విధానాన్ని కూడా తాము పునరుద్దరించామని చెప్పారు. వృద్దాప్య పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే తర్వాతి నెలలోనే భార్యకు పింఛన్ అందిస్తున్నట్లు వెల్లడించారు. మొత్తం 2.5 లక్షల మంది ఈ కోటాలో లబ్ది పొందుతున్నట్లు స్పష్టం చేశారు. ఒక నెలలో ఎవరైనా ఫించన్ తీసుకోకపోతే తర్వాతి నెల కలిపి రెండు ఒకేసారి ఇస్తున్నామన్నారు. దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లలో అనర్హులు ఉన్నట్లు తేలిందని, అందుకే పున:పరిశీలన చేపడుతున్నట్లు వివరించారు. ఇప్పటివరకు 1.40 లక్షల మంది అనర్హులని గుర్తించామని, వీరికి నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మరోసారి పరిశీలన చేపట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా కొత్త ఫించన్ల దరఖాస్తుపై ఏపీ ప్రభుత్వం ఎప్పుడో ప్రక్రియ చేపట్టిందని.. కొన్ని కారణాల వలన నిలిచి పోయిందని వివరించారు. త్వరలోనే కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తుల పైన ప్రభుత్వం నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది.


