India
oi-Lingareddy Gajjala
కంటికి కనిపించని ఒక మైక్రో బ్యాక్టీరియా ఇప్పుడు కేరళంను గజగజ వణికిస్తోంది. నిన్న మొన్నటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ‘షిగెల్లా’ (Shigella) మహమ్మారి ఒక్కసారిగా పడగ విప్పింది. కోజికోడ్లో మూడున్నరేళ్ల పసిప్రాణాన్ని బలితీసుకోవడంతో స్థానికుల్లో ఒక్కసారిగా వణుకు మొదలైంది.
ఆనక్కుజిక్కర, కుట్టిక్కత్తూరు ప్రాంతాల్లో ఈ వ్యాధి తీవ్రత ఆందోళనకరంగా మారుతోంది. మరణించిన చిన్నారి చదువుతున్న అంగన్వాడీలోనే మరో ముగ్గురు చిన్నారులకు, అలాగే పరిసర ప్రాంతాల్లో ఐదుగురికి ఈ వ్యాధి లక్షణాలు కనిపించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
అసలు ఏంటీ షిగెల్లా (Shigella) ?
ఇది ఒక సాధారణ విరేచనాల వ్యాధి అని అనుకుంటే పొరపాటే. ఇది నేరుగా మనిషి జీర్ణవ్యవస్థపై దాడి చేసే అత్యంత ప్రమాదకరమైన బ్యాక్టీరియా. ఇన్ఫెక్షన్ సోకగానే రక్తంతో కూడిన విరేచనాలు, తీవ్రమైన కడుపు నొప్పి, జ్వరం, వాంతులతో రోగిని నిలువునా నీరసింపజేస్తుంది. ముఖ్యంగా ఐదేళ్ల లోపు పిల్లలకు ఇది యమపాశంలా మారుతోంది. ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల్లో పసిపిల్లల మరణాలకు ఈ షిగెల్లా ప్రధాన కారణమని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
మీరు తాగే నీరు.. తినే ఆహారం సురక్షితమేనా?
కలుషితమైన నీరు, నిల్వ ఉన్న ఆహారం ద్వారా ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఒకరి నుంచి ఒకరికి అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. రోగి విసర్జించిన మలంతో ఏమాత్రం సంబంధం ఉన్నా, లేదా చేతులు శుభ్రంగా కడుక్కోకుండా పిల్లలకు ఆహారం తినిపించినా ఈ మహమ్మారి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. డైపర్ మార్చిన తర్వాత చేతులు కడుక్కోకపోవడం, ఈత కొట్టే సమయంలో కలుషిత నీటిని మింగడం వంటి చిన్న చిన్న పొరపాట్లు ప్రాణాంతక ఇన్ఫెక్షన్కు దారితీస్తున్నాయి.
లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు!
సాధారణంగా ఈ వ్యాధి లక్షణాలు రెండు నుంచి ఏడు రోజుల పాటు ఉంటాయి. కొందరిలో లక్షణాలు బయటపడకపోయినా, వారు ఇతరులకు ఈ వ్యాధిని అంటించే ‘క్యారియర్లు’గా మారుతుండటం మరింత ప్రమాదకరం. జ్వరం తగ్గకుండా, విరేచనాల్లో రక్తం పడుతుంటే అది షిగెల్లా ఇన్ఫెక్షన్గా అనుమానించాలి. నిర్లక్ష్యం చేస్తే డీహైడ్రేషన్ వల్ల ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది.
బతకాలంటే ఈ జాగ్రత్తలు తప్పవు!
అమెరికాకు చెందిన సీడీసీ (CDC) నివేదిక ప్రకారం.. ఈ వ్యాధిని అరికట్టడానికి శుభ్రత ఒక్కటే మార్గం.
- ఆహారం వండటానికి ముందు, తినడానికి ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
- కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి.
- పచ్చి కూరగాయలు, పండ్లను ఉప్పు నీటితో కడిగిన తర్వాతే వాడాలి.
- పిల్లల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి.
కేరళలో మొదలైన ఈ అలజడి పొరుగు రాష్ట్రాలకు వ్యాపించకముందే అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


