India
oi-Chandrasekhar Rao
ఇరాన్ సుప్రీమ్ లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రత్యేక నివేదికలు వెలువడుతున్నాయి. ఆయన కోమాలో ఉన్నారని, ఒక కాలును తొలగించినట్లు రిపోర్టులు అందుతున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని బ్రిటిష్ వార్తాపత్రిక ‘ది సన్’ తెలిపింది. ఈ మేరకు ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అత్యంత విశ్వసనీయ వర్గాలను తన కథనంలో ఉటంకించింది.
ఈ పరిణామాల మధ్య భారత ఇంటెలిజెన్స్ బ్యూరో కీలక సమాచారాన్ని సేకరించింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ప్రాణాలతో ఉన్నాడని నిర్ధారించింది. తీవ్రంగా గాయపడ్డారని, ఆయనకు సంబంధించిన కమ్యూనికేషన్లపై కఠిన ఆంక్షలున్నాయని భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇరాన్ రివాల్యూషనరీ గార్డ్స్ (IRGC) పర్యవేక్షణలో ట్రీట్మెొంట్ తీసుకుంటోన్నారని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాలు పేర్కొన్నాయి.
దీనిపై సీఎన్ఎన్- న్యూస్18 ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలను తన కథనానికి ఉటంకించింది. ఖమేనీ స్థితిపై ఊహాగానాలు చెలరేగుతున్న వేళ తాజా నివేదిక వెలుగులోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ నిర్వహించిన దాడిలో అయతొల్లా అలీ ఖమేనీ మరణించగా, మొజ్తబా తీవ్రంగా గాయపడి కదలలేని స్థితికి చేరుకున్నారు.
ప్రాణాలతో బయటపడినప్పటికీ, మొజ్తబా ఖమేనీ శారీరక పరిస్థితి విషమంగా ఉంది. దీంతో సుప్రీం లీడర్గా ఆయన ఆరోగ్య స్థితికి సంబంధించిన సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతోంది ఐఆర్జీసీ. దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా దీని నియంత్రణలో ఉన్నాయి. ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారనే సమాచారం బయటికి పొక్కితే ఇరాన్ లో అస్థిర పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని ఐఆర్జీసీ భావిస్తోంది. అందుకే అతి జాగ్రత్తగా, పరిమితంగా మాత్రమే సమాచారాన్ని విడుదల చేస్తోంది.
ఖమేనీ గాయపడిన తర్వాత రివాల్యూషనరీ గార్డ్స్ సీనియర్ సభ్యులే ఆయనను మొదట సంప్రదించారని సీఎన్ఎన్ కథనం తెలిపింది. సుప్రీం లీడర్ గా మొజ్తబా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అధికారికంగా పాల్గొనకపోవడంతో ఆయన ఆరోగ్యంపై నెలకొన్న ఊహాగానాలు మరింత బలపడ్డాయి. ఆయన ఆరోగ్యం గురించి ఎలాంటి సమాచారం లీక్ అవ్వకుండా దేశీయ, అంతర్జాతీయ పరిశీలకుల నుండి గోప్యంగా ఉంచుతోంది.


