International
oi-Chandrasekhar Rao
ఇరాన్ కొత్త సుప్రీమ్ లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రత్యేక నివేదికలు వెలువడుతున్నాయి. ఆయన కోమాలో ఉన్నారని, ఒక కాలును తొలగించినట్లు రిపోర్టులు అందుతున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని బ్రిటిష్ వార్తాపత్రిక ‘ది సన్’ తెలిపింది. ఈ మేరకు ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అత్యంత విశ్వసనీయ వర్గాలను తన కథనంలో ఉటంకించింది.
ప్రస్తుతం ఆయన టెహ్రాన్లోని సినా యూనివర్సిటీ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్లో యూనిట్ లో కోమాలో ఉన్నారని ది సన్ పేర్కొంది. ఇరాన్ ఆరోగ్య, విద్యాశాఖ మంత్రి మొహమ్మద్ రెజా జాఫర్గందీ పర్యవేక్షణలో డాక్టర్లు చికిత్స చేస్తోన్నట్లు వివరించింది. ఇరాన్ ప్రముఖ సర్జన్లలో ఒకరు రెజా జాఫర్. హాస్పిటల్ భవనంలోని ఒక భాగాన్ని భారీ భద్రత మధ్య సీల్ చేశారని కూడా ఆ కథనం వెల్లడించింది.
ఈ వార్తలపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఖమేనీ ఇంకా బతికే ఉన్నాడని నిర్ధారించారు. ఏదో ఒక రూపంలో సజీవంగా ఉన్నాడని వ్యాఖ్యానించారు. ఫాక్స్ న్యూస్ రేడియో కార్యక్రమంలో బ్రియాన్ కిల్మీడ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. ఖమేనీ గాయపడ్డాడంటూ వచ్చిన వార్తల గురించి యాంకర్ ప్రశ్నించగా.. ఆయన సమాధానం ఇచ్చారు. ఏదో ఒక రూపంలో మొజ్తబా ఇంకా జీవించే ఉన్నాడని అన్నారు.
ఫిబ్రవరి 28వ తేదీన ఇజ్రాయెల్ నిర్వహించిన తొలి దాడి సమయంలో అయతొల్లా ఖమేనీ మరణించగా మొజ్తబా ప్రాణాలతో బయటపడి ఉండొచ్చని అన్నారు. ఆయనకు తీవ్ర గాయలు అయివుండొచ్చని తేల్చి చెప్పారు. దాడి ఆరంభం నుండీ ప్రజల ముందుకు కనిపించకపోయిన విషయాన్ని గుర్తు చేశారు.
ఫిబ్రవరి 28 నాటి అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నుండి మొజ్తబా ఖమేనీ ఒక్కసారి కూడా బహిరంగంగా కనిపించలేదు. అయతొల్లా ఖమేనీ మరణం తర్వాత మార్చి 8న మొజ్తబా సుప్రీం లీడర్గా ఎన్నికయ్యారు. ఆయన ప్రసంగిస్తారని ఇరాన్ మీడియా మొదట ప్రకటించినా, అది కార్యరూపం దాల్చలేదు. సుప్రీం లీడర్గా ఎన్నికైన అయిదు రోజుల తర్వాత, ఆయన తొలి సందేశం టీవీలో ఓ యాంకర్ చదివి వినిపించారే తప్ప మొజ్తబా కెమెరా ముందు కనిపించలేదు.


