International
-Bomma Shivakumar
ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సైన్యం సంయుక్తంగా దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. గత నాలుగు రోజులుగా దాడులు అంతకంతకు తీవ్రతరం అవుతున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో ఖమేనీ కుటుంబంతో పాటు దాదాపు ఇరాన్ ప్రభుత్వంలోని అధికారులంతా హతం అయ్యారు. అయితే ఖమేనీ హతం వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా లండన్ కు చెందిన ‘ఫైనాన్షియల్ టైమ్స్’ నివేదిక ప్రకారం.. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ.. అలాగే ఆ దేశ ఉన్నత సైనికాధికారులను హతమార్చేందుకు ఇజ్రాయెల్ గూఢచార సంస్థలు చేపట్టిన దీర్ఘకాల ప్రణాళికను వెల్లడించింది. ఖమేనీ కదలికలను, ఆయన భద్రతా సిబ్బంది ఆచూకీని పసిగట్టడానికి ఇజ్రాయెల్ సంవత్సరాల తరబడి టెహ్రాన్లోని ట్రాఫిక్ కెమెరాలను హ్యాక్ చేసి, మొబైల్ ఫోన్ నెట్వర్క్లను యాక్సెస్ చేసిందని పేర్కొంది. ప్రస్తుతం ఈ కథనం సంచలనంగా మారింది.
‘ఫైనాన్షియల్ టైమ్స్’ నివేదిక ప్రకారం.. టెహ్రాన్ లోని దాదాపు అన్ని ట్రాఫిక్ కెమెరాలను ఇజ్రాయెల్ సంవత్సరాల పాటు హ్యాక్ చేసింది. ఈ కెమెరాల నుండి లభించిన ఫుటేజీని ఎన్ క్రిప్ట్ చేసి సర్వర్ లకు పంపించింది. ఈ హ్యాకింగ్ ఆపరేషన్.. ఇజ్రాయెల్, అమెరికా దళాలకు ఖమేనీ ఖచ్చితమైన స్థానాన్ని తెలుసుకోవడానికి సహాయపడింది. ఫలితంగా.. ఇజ్రాయెల్- అమెరికా సైన్యం పకడ్బందీగా వారిని హతమార్చింది.
మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఇరాన్ పై జరిగిన దాడులను సమర్థించారు. ఓ ఇంటర్వ్యూలో నెతన్యాహు మాట్లాడుతూ.. ఇస్లామిస్ట్ పాలన అమెరికాను దెబ్బతీయడానికే కట్టబడి పనిచేసిందని ఆరోపించారు. ఇరాన్ 47 సంవత్సరాలుగా అమెరికాను శత్రువులాగే చూసిందన్నారు. ఇరాన్ సైనికులు అమెరికా రాయబార కార్యాలయాలపై బాంబు దాడి చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను రెండుసార్లు హత్య చేయడానికి ప్రయత్నించారు. అలాగే ఇరాన్ లోనూ అక్కడి సైనికులు.. స్వంత ప్రజలను హత్య చేశారు. చాలా మందిని ఊచకోత కోశారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని విస్తరించారు” అని నెతన్యాహు తెలిపారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఫాక్స్ మాట్లాడుతూ.. ఇరాన్ కు అణ్వాయుధాలు ఎప్పటికీ ఉండకూడదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరుకున్నారని చెప్పారు. ఇప్పటికైనా ఇరాన్ ఆలోచన ధోరణి మారాలని సూచించారు. మరోవైపు ఇరాన్ పాలన బలహీనపడిందని ఆయన తెలిపారు. ఇక అంతకుముందు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్ పై ప్రస్తుతం ఈ దాడులు జరగకపోయి ఉంటే భవిష్యత్తులో వాళ్లు ఎంత ప్రమాదకరంగా మారేవారో ఊహించుకోలేమని తెలిపారు. ఇప్పుడు ఇరాన్ బలహీన పడిందన్నారు.


