Telangana
oi-Jakki Mahesh
అదో దట్టమైన అటవీ ప్రాంతం, రెండు రాష్ట్రాల సరిహద్ధు కీకరారణ్యం. ఆ ప్రాంతంలో అడుగు పెట్టాలంటే అటవీ శాఖ నిబంధనలుంటాయి అలాంటి నిబంధనలను తుంగలో తొక్కి వందల సంఖ్యలో కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాల పార్కింగ్లతో స్వచ్ఛమైన అటవీ ప్రాంతాన్ని జూదాలకు అడ్డాగా మార్చారు కొందరు వ్యక్తులు. వారంలో రెండు రోజులు జరిగే ఈ జూదశాలలో కోట్ల రూపాయల దందా కొనసాగుతుంది. ప్రభుత్వ నిషేధిత ఆటల కోసమే నిర్వహించే ఈ సంతపై దాడులు చేసేందుకు ఏ అధికారులు అక్కడికి రాకుండా చూసుకుంటారు నిర్వాహకులు. అసలు ఆ ప్రాంతం ఎక్కడో.. ఆ జూదశాల నిర్వాహకులు చేసే దందా గురించి తెలుసుకుందాం.
జూదశాలగా మారిన అటవీ ప్రాంతం
ములుగు జిల్లా జాతీయ రహదారి 163 తెలంగాణ, చత్తీస్గఢ్ సరిహద్ధు గ్రామమైన తారలగూడ అటవీ ప్రాంతంలో వారంలో రెండు రోజుల పాటు జరిగే సంతను ఓ ఇద్దరు వ్యక్తులు జూదశాలగా మార్చారు. రాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతాన్ని అడ్డాగా ఎంచుకుని పరిసర ప్రాంత పోలీసు, అటవీ శాఖ అధికారులను డబ్బులతో కమ్మేసారని సమాచారం. దీంతో పస్ర, ఏటూరునాగారం, వాజేడు, నూగురు వెంకటాపురం, పేరూరు రహదారుల వెంట జూద ప్రాంతానికి పందెం కోళ్లతో చేరుకునే వాహనాలను సైతం వాహన తనిఖీలు చేసే పోలీసులు వదిలేస్తారని తెలుస్తోంది.
ఎంట్రీ ఫీజు రూ.1500
జూద ప్రాంతంలో కోడి పందాలు, పేకాట, కాయ్ రాజా కాయ్ ఆటలు నిర్వహిస్తూ కోట్లల్లో చేతులు మారతాయని సమాచారం. ఈ సంతలో అడుగు పెట్టాలంటే ఎంట్రీలోనే రూ.1500 ఫీజు తీసుకుని చేతిపై ముద్ర వేస్తారు. ఆ ముద్ర ఉన్న వాళ్లే ఆ సంతలో తిరగాలి, పందెంలో పోటి చేయాలి లేకుంటే అక్కడ నుండి గెంటేయడమే వారి నిబంధనలో సూత్రం. జూద ప్రాంతాన్ని మొత్తం ఇద్ధరు వ్యక్తులే శాశిస్తారని తెలిసింది.వారు ఓ చోట ఉండి నడిపిస్తుంటారని.. ఆ ప్రాంతానికి చేరుకునే వారిని కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేరుకునేలా చూసుకుంటారని తెలుస్తోంది.
కమీషన్ చెల్లించాల్సిందే..
లక్ష పందెం వేస్తే వీరి కమీషన్ పది వేయిలు చెల్లించాల్సిందే.. అలా ఒక్క రోజులో వందల మంది వస్తారు అంటే ఆ జూదశాలలో ఏ స్థాయిలో దందా కొనసాగుతుందో అర్థం చేసుకోవాలి.భారీ సంఖ్యలో కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, బొలేరోలు చేరుకుని వారంలో రెండు రోజుల పాటు జరిగే సంతలో పలు రకాల నిషేధత జూదాలలో పాల్గొని, మత్తు పానీయాలు, గంజాయి మత్తులో తూగతూ ఎంజాయ్ చేస్తుంటారు.ఏజెన్సీ అటవీ ప్రాంతాన్నీ జూద ప్రాంతంగా మార్చి ప్రభుత్వ నిషేధిత, అసాంఘీక కార్యకలపాలను అడ్డుకుని.. వివిధ రకాల జూదాలకు బానిసలుగా మారి కుటుంబాలకు దూరమవుతున్న వారిని రక్షించాలని పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు.
చట్టపరంగా చర్యలు చేపట్టాలి..
అంతేకాకుండా నేరాలను అరికట్టి శాంతియుత వాతావరణాన్ని నెలకొనేలా చూడాల్సిన సంబందిత అధికారులే.. కాసులకు కక్కుర్తి పడి ఇలాంటి వ్యక్తులకు సహకరించి జూదశాల నిర్వహణకు కారకులవుతున్నారని ప్రజలు వాపోతున్నారు. పస్ర, ఏటూరునాగారం, పేరూర్, వాజేడు, నూగురు వెంకటాపురం, మంగపేట పోలీసులు వాహన తనిఖీల్లో క్షుణ్ణంగా పరిశీలించి ఇలాంటి వాటిని అడ్డుకోవాలని కోరుతున్నారు. తారలగూడ అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఈ సంతపై ప్రత్యేక దృష్టి సారించి నిర్వాహకులను అదుపులోకి తీసుకుని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు.


