Andhra Pradesh
oi-Sai Chaitanya
Tirumala: టీటీడీ చిన్నారుల కోసం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. తెలంగాణలోని బాసర జ్ఞానసరస్వతీదేవి ఆలయం తరహాలో తిరుపతిలో శ్రీవకుళమాత ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేసేందుకు అవకాశం కల్పించనుంది. అక్షర గోవిందం పేరుతో ఈ కార్యక్రమం నిర్వహణకు సమాయత్తం అవుతోంది. అందులో భాగంగా చిన్నారులకు ప్రత్యేక కిట్ ఇవ్వనుంది. ఇందు కోసం టీటీడీ అధికారికంగా నియమ – నిబంధనలను ఖరారు చేస్తోంది.
టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్షర గోవిందం పేరిట అక్షరాభ్యాస వేడుకలను ప్రారంభించనుంది. తిరుపతిలోని శ్రీవకుళ మాత ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేసేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఈ అక్షరాభ్యాస వేడుక ఏడుకొండలవాడి ఆశీస్సులతో, స్వామి వారి మాతృమూర్తి అయిన శ్రీవకుళ మాత సన్నిధిలో చిన్నారుల అక్షరా భ్యాసం నిర్వహణ కు వీలుగా టీటీడీ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ప్రారంభ దశలో కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనుంది. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఈ అక్షర గోవిదం ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. అందులో భాగంగా టీటీడీ అధికారులు ఇటీవల తిరుపతి శివారు పేరూరులోని వకుళమాత దేవాలయాన్ని సందర్శించారు. ప్రాజెక్టు అమలకు సంబంధించి బోర్డు సమావేశంలో సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు.
చిన్నారులకు ఏడు వస్తువులతో కొట్ పంపిణీ
వకుళమాత ప్రధాన ఆలయం చిన్న కొండ పై నెలకొని ఉండడం వల్ల అక్కడ స్థలాభావం ఉంది. దీంతో అక్షరాభ్యాసానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని కూడా ఎంపిక చేశారు. ఆలయానికి తూర్పు వైపున ఉన్న ఖాళీ స్థలంలో ఈ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కరిణికి సమీపం లోని ఈ ప్రదేశం అనువైనదిగా గుర్తించారు. శాశ్వత ప్రాతిపదికన సకల వసతులతో మండపాన్ని నిర్మించనున్నారు. ఈ వేదిక పై వేంకటేశ్వర స్వామి, పద్మావతి, సరస్వతీదేవి విగ్రహాలను ప్రతి ష్ఠించారు. ఆ ప్రాంగణంలో చిన్నారులతో అక్షరాలు దిద్దించనున్నారు. అక్షరాభ్యాసం తర్వాత పిల్లలకు “అక్షర గోవిందం” పేరిట రూపొందించిన కిట్ ఇవ్వనున్నారు. ఈ కిట్ లో పలక, బలపాల బాక్స్, శ్రీవారి అక్షతలు, అమ్మవారి కుంకుమ ప్యాకెట్లు, 6 కంకణాలు, పటిక బెల్లం (కలకండ) ప్రసాదం ప్యాకెట్, వినాయకుడు-సరస్వతీదేవి-శ్రీ వేంకటేశ్వర స్వామితో కూడిన చిత్రపటం (ఫ్రేమ్) ఉంటాయి. త్వరలోనే అధికారికంగా ఈ మేరకు కార్యక్రమం వివరాలు వెల్లడించనున్నారు.


