Andhra Pradesh
oi-Bomma Shivakumar
వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కలిశారు. చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్ లో వైఎస్ సునీల్ రెడ్డి (వైఎస్ జగన్ పెదనాన్న వైఎస్ జార్జిరెడ్డి కుమారుడు) కుమారుడి వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాహ వేడుకకు కుటుంబ సమేతంగా జగన్ హాజరయ్యారు. ఈ క్రమంలో వైఎస్ జగన్, విజయ్ పక్కపక్కనే కూర్చుని ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో జననాయకుడితో జన నాయగన్ అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.
వైఎస్ సునీల్ రెడ్డి(వైఎస్ పెదనాన్న వైఎస్ జార్జి రెడ్డి కుమారుడు) కుమారుడు సాహిల్ వివాహం సందర్భంగా ఆ వేడుకలో పాల్గొనేందుకు చెన్నైకు వెళ్లిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ను పలువురు ప్రముఖులు కలిశారు. వీరిలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తి.. టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు తదితరులు కలిశారు. ఆ ఆత్మీయ పలకరింపులు, ఆప్యాయతల క్షణాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
ఇక ఈ వివాహ వేడుకకు వైఎస్ జగన్ తన తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతితో కలిసి వెళ్లారు. అలాగే ఈ వేడుకకు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, విడదల రజిని వంటి వైసీపీ నేతలు కూడా హాజరయ్యారు. ఈ మేరకు వైఎస్ జగన్.. నూతన వధూవరులు సాహిల్, వేదికలకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.


