Andhra Pradesh
oi-Korivi Jayakumar
దేశవ్యాప్తంగా ఆన్లైన్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పూటకే రూపం మారుస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు ఈ కేటుగాళ్లు. సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా ప్రజాప్రతినిధులు, పెద్ద వ్యాపారవేత్తలు కూడా వీరి బారిన పడుతున్నారు. సెల్ఫోన్లకు వచ్చే అనుమానాస్పద లింకులు, కాల్స్ను నిర్లక్ష్యంగా క్లిక్ చేయడం వల్ల పెద్ద మొత్తంలో డబ్బు పోతున్న ఘటనలు వరుసగా బయటపడుతున్నాయి. తాజాగా ఏపీలోని పోలవరం జనసేన MLA చిర్రి బాలరాజుకు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు.
సమాచారం ప్రకారం.. ఎమ్మెల్యేకు మొబైల్కు ఒక సందేశం వచ్చింది. అందులో రోడ్డు రవాణా శాఖ చలానా చెల్లించాల్సి ఉందని చెప్పుతూ ఒక లింక్ పంపించారు. అది అధికారిక నోటీసు అనుకుని ఆయన ఆ లింక్ను క్లిక్ చేసినట్లు తెలుస్తోంది. లింక్ ఓపెన్ చేసిన కొద్ది సేపటికే ఆయన బ్యాంక్ ఖాతా నుంచి వరుసగా నగదు ట్రాన్సాక్షన్లు జరిగి మొత్తం రూ.12 లక్షలు డెబిట్ అయ్యాయి.
తన ఖాతా నుంచి డబ్బులు మాయమైనట్లు గుర్తించిన వెంటనే ఎమ్మెల్యే అప్రమత్తమై పోలీసులను సంప్రదించారు. ఈ ఘటనపై ఆయన జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్ విభాగంతో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. డబ్బులు ఏ ఖాతాలకు బదిలీ అయ్యాయో, మోసగాళ్లు ఎక్కడి నుంచి ఈ మోసం నిర్వహించారో అన్వేషిస్తున్నారు.
ఇటీవలి కాలంలో ఆర్టీఏ చలానా, బ్యాంక్ అప్డేట్, కూరియర్ డెలివరీ, కేవైసీ వెరిఫికేషన్ వంటి పేర్లతో నకిలీ లింక్లు పంపుతూ ప్రజలను మోసం చేసే ఘటనలు ఎక్కువయ్యాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా, వాట్సాప్, SMSల ద్వారా పంపే APK ఫైళ్లు లేదా అనుమానాస్పద లింక్లను ఓపెన్ చేయడం వల్ల మొబైల్లోని వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ Harish Kumar Gupta ఇప్పటికే ప్రజలకు కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియాలో షేర్ అయ్యే APK ఫైళ్లు, తెలియని లింక్లు, అనుమానాస్పద యాప్లను డౌన్లోడ్ చేయకూడదని స్పష్టం చేశారు. అధికారిక వెబ్సైట్ లేదా యాప్ ద్వారానే చలానాలు, బిల్లులు చెల్లించాలని సూచించారు. ఎవరైనా ఇలాంటి మోసానికి గురైతే వెంటనే సైబర్ హెల్ప్లైన్ 1930కు కాల్ చేయాలని, సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. తక్షణ చర్య తీసుకుంటే డబ్బులను తిరిగి పొందే అవకాశాలు కొంతవరకు ఉంటాయని చెప్పారు.
ఈ ఘటనతో మరోసారి సైబర్ భద్రతపై అవగాహన అవసరం ఎంత ముఖ్యమో స్పష్టమైంది. చిన్న లింక్ అయినా సరే, క్లిక్ చేసే ముందు అది నిజమైనదా కాదా అనేది తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. RTA, బ్యాంకులు, ప్రభుత్వ విభాగాలు ఎప్పుడూ వ్యక్తిగత లింకుల ద్వారా బకాయిలు చెల్లించమని అడగవని.. ఎల్లప్పుడూ అధికారిక వెబ్సైట్ లేదా యాప్ ద్వారానే లావాదేవీలు చేయాలని సూచిస్తున్నారు.


