Andhra Pradesh
oi-Chandrasekhar Rao
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో రెండో అతి పెద్ద పార్టీ అయిన జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంపై దృష్టి సారించింది. గ్రామస్థాయిలో పార్టీని విస్తరించే క్రమంలో భాగంగా దీన్ని చేపట్టింది. అధికారంలోకి వచ్చిన తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం ఇది రెండోసారి. మొత్తంగా చూసుకుంటే ఇది నాలుగోదఫా. ప్రస్తుతం ఆ పార్టీకి 12.98 లక్షల సభ్యత్వాలు ఉన్నాయి.
జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ ఉదయం పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లాంఛనంగా ప్రారంభించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో దీనికి స్వయంగా శ్రీకారం చుట్టారు. సభ్యత్వ నమోదు కోసం ఏకంగా రెండు కోట్ల రూపాయల విరాళాన్ని ఇచ్చారాయన. తొలి సభ్యత్వాన్ని తీసుకున్నారు.
పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకొని, సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ఎవరైతే ముందుకు వచ్చి సభ్యత్వం తీసుకుంటారో వారిని “ఉద్యమి”గా గుర్తిస్తుంది జనసేన. పార్టీ పోరాటానికి మరింత బలాన్ని అందించి, నవతరంలో ప్రేరణ కలిగించి పార్టీ సిద్ధాంతాలకి ఆకర్షితులను చేసి సభ్యత్వ నమోదు చేసేవారిని “సాధక్” అని పేరు పెట్టింది. తమ వంతు సమయాన్ని, ఆర్థిక, సాంకేతిక, సేవా, మేథా సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసేవారిని “ప్రదాత”గా ఇక నుంచి పిలుస్తారు.
సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. తొలుత 150 మందితో పార్టీని ప్రారంభించామని, 2021లో మొదటి విడత క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించినప్పుడు 90,000 మందిని నమోదు చేశామని వివరించారు. ఎన్నికల ముందు ఆ సంఖ్య ఆరు లక్షలకు చేరిందని, ఆ తర్వాత 12.98 లక్షల సభ్యత్వాలు సాధించామని పేర్కొన్నారు. చిన్న వ్యాపారాలు చేసుకునే వారి నుంచి కూలి పనులు చేసుకునే వారు, చదువుకున్న వారు ఎంతో మంది ఈ ప్రక్రియలో భాగస్వాములయ్యారని గుర్తు చేశారు.
తమ భావజాలాన్ని అర్థం చేసుకొని, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారు ముఖ్యమని, అలాంటి వారే పార్టీకి అవసరమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో జనసేనరాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పవన్ రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


