Andhra Pradesh
oi-Chandrasekhar Rao
కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం బ్రహ్మోత్సవాలు సమీపిస్తోన్నాయి. దీనికి చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. మార్చి 27 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలు, శ్రీ సీతారాముల కల్యాణం ఏర్పాట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. సీతారామచంద్రులవారిని దర్శించడానికి వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటోన్నారు.
ఇప్పటివరకు చేపట్టిన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, అభివృద్ధి పనులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులపై టీటీడీ జేఈఓ వీరభద్రం సమీక్ష నిర్వహించారు. కళ్యాణ వేదిక వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. భక్తులకు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించే 17 కౌంటర్లు, ప్రవేశ- నిష్క్రమణ గేట్లను పరిశీలించారు. బ్రహ్మోత్సవం నాటికి కల్యాణ వేదిక ప్రాంగణంలోని వసతి సముదాయం వద్ద ఉన్న జల ప్రసాదాన్ని వినియోగంలోకి తీసుకురావాలని అన్నారు.
కల్యాణ వేదికకు నలువైపులా పచ్చదనానికి ప్రాముఖ్యత ఇచ్చేలా తీర్చిదిద్దాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. భక్తులకు సౌకర్యవంతంగా క్యూలైన్లు, వసతి షెల్టర్లు, సూచిక బోర్డులు, మంచినీటి సౌకర్యం, తదితర ఇంజనీరింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. రథం తిరిగే వీధులు, ముఖ్యంగా మాడ వీధుల్లో మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఆకట్టుకునేలా కటౌట్లు, విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేయాలని ఆదేశించారు.
స్వామివారి కల్యాణానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు అన్నప్రసాదాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. భక్తులకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించడానికి విరివిగా మజ్జిగ, తాగునీరు పంపిణీ చేయడానికి అవసరమైన కౌంటర్లు సిద్ధం చేసుకోవాలని, టీటీడీ విజిలెన్స్ అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని భద్రత, పార్కింగ్ ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.
బ్రహ్మోత్సవాల వాహన సేవలను భక్తులు వీక్షించేందుకు వీలుగా ఎల్.ఈ.డి స్క్రీన్ లు ఏర్పాటు చేయాలని, హిందూధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తులను ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనాలను నిర్వహించనుంది టీటీడీ. బ్రహ్మోత్సవాల వాహన సేవల ముందు హిందూ ధర్మ ప్రచార పరిషత్ భజన బృందాలు ఆకట్టుకునేలా ప్రదర్శనలు ఉండాలని, అలాగే కల్యాణోత్సవం రోజున చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.


