Telangana
oi-Bomma Shivakumar
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మార్చి 20న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న తెలంగాణ వార్షిక బడ్జెట్ (2026-27)పై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. డాడీ, మోదీ, చిన్న మోదీపైనే తన పోరాటమని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీ అజెండాపై కసరత్తు జరుగుతోందని పేర్కొన్నారు. శుభ ముహూర్తం చూసుకుని కొత్త పార్టీ ప్రకటిస్తానని స్పష్టం చేశారు.
సామాజిక తెలంగాణ ధ్యేయంతో సర్వోదయ తెలంగాణ దిశగా ముందుకు వెళ్తామని కవిత తెలిపారు. మహాత్మా గాంధీ సర్వోదయ సిద్ధాంతాన్ని స్టడీ చేస్తున్నట్లు కవిత స్పష్టం చేశారు. పార్టీ ప్రారంభించినప్పుడే అజెండా, లక్ష్యాలు ప్రకటిస్తామని వివరించారు. తన కొత్త పార్టీ అజెండాపై కసరత్తు జరుగుతోందని అన్నారు. కొత్త రాజకీయాలు చేస్తామని.. సంకీర్ణ, రెయిన్ బో రాజకీయాలు అవసరమని కవిత తెలిపారు.
భావసారూప్యత కలిగిన వారు, కలిసి వచ్చేవారితో కలిసి పోరాటం చేస్తామని కవిత తెలిపారు.
బీఆర్ఎస్తో నా అంశాన్ని రేవంత్రెడ్డి రాజకీయంగా వాడుకుంటున్నారని స్పష్టం చేశారు. పార్టీ ప్రకటనకు ముందే జాతీయ నేతలను కలిసే అంశాన్ని ఆలోచిస్తున్నానని కవిత పేర్కొన్నారు.
పార్టీ కార్యాలయం కోసం అనువైన స్థలాన్ని అన్వేషిస్తున్నట్లు వివరించారు. అన్ని జిల్లాల్లో తమ పార్టీ ప్రభావం ఉంటుందన్నారు. యువత, మహిళలు, ఉద్యమంలో పనిచేసిన వారికి అవకాశం ఇస్తామని కవిత అన్నారు.
శ్రీరామనవమి తర్వాత కొత్త పార్టీని అధికారికంగా ప్రకటిస్తానని, అంతకంటే ముందే తనకున్న పరిచయాలతో జాతీయ స్థాయి నేతలను కలిసి మద్దతు కోరతానని కవిత వెల్లడించారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అనే తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా తనను పోటీ చేయాలని కోరుతున్నారని కవిత పేర్కొన్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో కొత్త పార్టీ ప్రభావం బలంగా ఉంటుందని.. ఇటీవలే వనపర్తి నుంచి పోటీ చేయాలని జాగృతి కార్యకర్తలు కోరారని ఆమె వెల్లడించారు.


