India
oi-Chandrasekhar Rao
నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఏప్రిల్ 9వ తేదీన కేరళ, అదే నెల 23వ తేదీన తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఒకేదశలో ఇవి ముగుస్తాయి. మే 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికలు ఎదుర్కొంటోన్న నాలుగు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఉంది. ఈ రాష్ట్రంతో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరీ ఉన్నాయి.
ఈ పరిణామాల మధ్య భారతీయ జనతా పార్టీకి బిగ్ బూస్ట్ లభించింది. దేశవ్యాప్తంగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మొత్తం 37 స్థానాలకు గాను 21 గెలుచుకుంది. దీంతో ఎగువ సభలో బీజేపీ పట్టు మరింత బలపడింది. ఇండియా బ్లాక్ 13 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. బిజూ జనతాదళ్ ఒక స్థానాన్ని గెలుచుకుంది. హర్యానాలోని రెండు రాజ్యసభ ఎన్నికల లెక్కింపు నిలిచిపోయింది. ఈ 37 స్థానాల్లో 26 మంది ఎంపీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇందులో బీజేపీ నుండి ఏడుమంది, ఆ పార్టీ మిత్రపక్షాలైన శివసేన, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఏఐఏడీఎంకే, పీఎంకే, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ నుండి ఒక్కొక్కరు ఉన్నారు. కాంగ్రెస్ అయిదు, తృణమూల్ కాంగ్రెస్ నాలుగు, డీఎంకే మూడు, ఎన్సీపీ (శరద్ పవార్) ఒక స్థానాన్ని ఏకగ్రీవంగా గెలుచుకున్నాయి. మిగిలిన 11 స్థానాలకు పోలింగ్ జరిగింది. అవి హర్యానాలో రెండు, బీహార్లో అయిదు, ఒడిశాలో నాలుగు చోట్ల ఎన్నికలు జరిగాయి.
ఒడిశాలో బేరసారాలు యథేచ్ఛగా సాగాయి. దీంతో బీజేపీ అదనంగా రెండింటిని దక్కించుకోగలిగింది. ఆ పార్టీ మద్దతుతో ఓ స్వతంత్ర అభ్యర్థి రాజ్యసభకు ఎన్నికయ్యారు. బీజేడీ ఒకే స్థానాన్ని నిలబెట్టుకుంది. నాలుగో స్థానం కోసం బీజేడీ, కాంగ్రెస్, సీపీఎం ఒక స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇవ్వగా, బీజేపీ మద్దతుతో దిలీప్ రే విజయం సాధించారు.
బీహార్లో ఎన్డీఏకు నాలుగు స్థానాలకు అవసరమైన బలం ఉంది. మజ్లిస్, బీఎస్పీ మద్దతు ఉన్నా కూడా ముగ్గురు కాంగ్రెస్, ఒక ఆర్జేడీ ఎమ్మెల్యే గైర్హాజర్ అయ్యారు. దీంతో ఇండియా బ్లాక్ కు ఓ సీటును కోల్పోవాల్సి వచ్చింది. జేడీయూ నుండి మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఎన్నికయ్యారు. బీజేపీ, జేడీయూ రెండేసి స్థానాలు గెలుచుకోగా, వాటి మిత్రపక్షం రాష్ట్రీయ లోక్ మోర్చా ఒక స్థానాన్ని గెలుచుకుంది.


