Telangana
oi-Dr Veena Srinivas
తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి తల్లిదండ్రుల విషయంలో ఇప్పటికే అనేక మార్లు ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశారు. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి, ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న గ్రూప్-1, గ్రూప్-2 నియామక ప్రక్రియలను పూర్తి చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. అధికారులకు నిర్వహించిన శిక్షణ ముగింపు వేడుకలో పాల్గొన్న ఆయన, కొత్తగా విధుల్లోకి చేరుతున్న వారికి దిశా నిర్దేశం చేశారు.
తల్లిదండ్రుల త్యాగాన్ని గుర్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
తల్లిదండ్రులను చూడాల్సిన అవసరాన్ని, చూడకుంటే జరిగే పరిణామాలను వివరించారు. ఎంతోమంది తల్లిందండ్రులు పిల్లలను కష్టపడి చదివిస్తే వారు ఉన్నతంగా ఎదుగుతున్నారని, ఉపాధి హామీ కూలీలుగా పనిచేసి పిల్లలను చదివించిన తల్లిదండ్రుల త్యాగాన్ని గుర్తు చేస్తూ, వారిని విస్మరించడం సరికాదన్నారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా తమ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోతే వారి జీతం కట్ అవుతుందన్నారు.
జీతం నుంచి 15 శాతం కోత
వారి జీతం నుంచి 15 శాతాన్ని కోత విధించి నేరుగా అమ్మానాన్నల ఖాతాలో వేసేలా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఒక కొత్త బిల్లును తీసుకువస్తాం అని స్పష్టం చేశారు.తెలంగాణ అధికారులకు పనిలో నైపుణ్యం పెరిగేలా ప్రపంచ స్థాయి శిక్షణ అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని సీఎం తెలిపారు. తాను స్వయంగా హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి, వారితో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు.
హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులతో ఉన్నత స్థాయి శిక్షణ తరగతులు
రాబోయే ఆరు నెలల్లో హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులు MCRHRDకి వచ్చి, అక్కడే ఉన్నత స్థాయి శిక్షణ తరగతులు నిర్వహిస్తారని భరోసా ఇచ్చారు. అధికారులకు హితవు పలికిన సీఎం, జాయిన్ అయిన రోజు ఎంత నిజాయితీగా, ఉత్సాహంగా ఉన్నారో.. రిటైర్మెంట్ రోజున కూడా అలాగే ఉండాలని వారికి సూచించారు. చట్టాలను ప్రజలకు సేవ చేసేందుకు ఉపయోగించాలి తప్ప, ఆపడానికి కాదు అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని గుర్తు చేసిన సీఎం
ప్రజల శ్రేయస్సు కోసమే చట్టాలు ఉన్నాయని, వాటిని మార్గదర్శకంగా తీసుకోవాలని సూచించారు.ఇదే సమయంలో తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని సీఎం గుర్తు చేశారు. ఇక్కడి ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని సహించరు. సహనంగా ఉంటారు కానీ ఆధిపత్యాన్ని అస్సలు ఒప్పుకోరు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సమ్మక్క-సారలమ్మల తిరుగుబాటు నుంచి ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటాల వరకు అన్నీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాగినవే అని రేవంత్ రెడ్డి అన్నారు.


