Andhra Pradesh
oi-Chandrasekhar Rao
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 67,085 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 24,832 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.78 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 23 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది.
కాగా- టీటీడీ కార్యనిర్వహణాధికారిగా కొత్తగా బాధ్యతలను స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర రంగంలోకి దిగారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తో కలిసి శనివారం మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. అనంతరం భక్తులతో మాట్లాడారు. అన్నప్రసాదం రుచి, నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. టీటీడీ సిబ్బంది వడ్డన విధానాలపైనా వారి అభిప్రాయాలను తీసుకున్నారు. భక్తులు తమ సంతృప్తిని వ్యక్తం చేశారు.
అనంరం ఈఓ.. అన్నప్రసాద విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు అక్కడి శ్రీవారి సేవకులతో ప్రత్యేకంగా మాట్లాడారు. వారు అందిస్తోన్న సేవలను అభినందించారు. అక్కడి నుంచి నేరుగా ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి వెళ్లారు రవిచంద్ర. మంచినీరు, ఆహార పదార్థాల నాణ్యతకు సంబంధించిన వివరాల గురించి ఆరా తీశారు. వివిధ ప్రమాణాలపై ఆహార పదార్థాల పరీక్షా ప్రక్రియను ఏవిధంగా నిర్వహిస్తారో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా ఆక్టోపస్ భవనం నుండి కృష్ణతేజ సర్కిల్ వరకు ఉన్న బయటి క్యూ లైన్లను పరిశీలించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ను సందర్శించారు. అక్కడ రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, హెడ్ కౌంట్ తదితర విశ్లేషణ వ్యవస్థలను పరిశీలించారు. ఈ సందర్భంగా అమెరికాలో ఉన్న దాత శ్రీ వీ జయప్రకాశ్ తో వర్చువల్గా మాట్లాడారు. తర్వాత పీఏసీ-5ను సందర్శించారు. న ఈవో, లాకర్లు, కల్యాణకట్ట, అన్నప్రసాదం, స్మార్ట్ షూ కీపింగ్ సెంటర్ వంటి సౌకర్యాలను పరిశీలించి, భక్తుల సౌకర్యార్థం మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.


