Andhra Pradesh
oi-Chandrasekhar Rao
తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం నాడు 72,528 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 26,664 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.41 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 22 కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 15 గంటల సమయం పట్టింది.
కాగా- స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లు, 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు టీటీడీ ప్రత్యేక సూచనలు ఇచ్చింది. ఆయా టికెట్లు ఉన్న భక్తులు- వారికి కేటాయించిన స్లాట్ ప్రకారం నిర్దేశిత సమయంలో మాత్రమే క్యూలైన్ లోకి ప్రవేశించడానికి అనుమతి ఇస్తామని టీటీడీ స్పష్టం చేసింది. ఈ నిబంధనను సోమవారం నుండి కఠినంగా అమలు చేస్తోన్నామని తేల్చి చెప్పింది.
భక్తులు తమకు కేటాయించిన సమయానికంటే ముందుగా వచ్చి ఇబ్బంది పడవద్దని సూచించింది. అలాగే తమకు కేటాయించిన స్లాట్ టైమ్ లో మాత్రమే క్యూ లైన్ లో ప్రవేశించి, సమయ నిబంధనలను పాటించే భక్తులను ఇబ్బంది పెట్టవద్దని విజ్ఞప్తి చేస్తోంది. భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని తమకు కేటాయించిన సమయానికే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని భక్తులకు కోరింది.


