Andhra Pradesh
oi-Dr Veena Srinivas
పరకామణి చోరీ కేసు, లడ్డు నెయ్యి కల్తీ అంశాలపైన టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల పరకామణి కేసులో మళ్ళీ ఎఫ్ఐఆర్ వేయడానికి సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని, అందులో వైసిపి నేతలను నిందితులుగా చేర్చడానికి ఒక డిఎస్పికి బాధ్యతలు కూడా ఇచ్చారని టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
పరకామణి చోరీ విషయంలో మరో కుట్ర: భూమన ఫైర్
రెండు రోజుల్లోనే దీనిపైన మళ్లీ టిటిడితో ఫిర్యాదు చేయించడానికి రెడీ అయ్యారని, ఈ విషయం పైన తనకు సమాచారం ఉందని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన భూమన పరకామణి కేసులో ఇప్పటికే విచారణ జరిపి కోర్టుకు నివేదిక సమర్పించిన తర్వాత మళ్లీ ఒక డిఎస్పి స్థాయి అధికారికి విచారణ బాధ్యతలు అప్పగించారని, వారికి కావలసిన విధంగా నివేదిక తయారు చేయించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారన్నారు.
సుప్రీం నిర్ణయంపైనే చంద్రబాబు ధిక్కారం
వైసిపి నేతలను టార్గెట్ చేసి సీఎం ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్టుగా భూమన తెలిపారు.సుప్రీం ఆదేశాలను ధిక్కరిస్తూ తిరుమల లడ్డు నెయ్యి కల్తీ విషయంలో చంద్రబాబు చేసేది చట్ట విరుద్ధమని ఆరోపించారు. సుప్రీంకోర్టు వేసిన సిట్ విచారణపైన నమ్మకం లేక, ఏకసభ్య కమిషన్ వేశారని చంద్రబాబు తీసుకునే నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సైతం తప్పు పడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
బూట్లు వేసుకుని శ్రీవారి విగ్రహాలను ఇచ్చే చంద్రబాబు
సుప్రీంకోర్టు సైతం మొట్టికాయలు వేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక మరోవైపు శాసనమండలిలో వైసిపి సభ్యులు దేవుడు చిత్రపటాలను తీసుకువెళ్లడం పై జరుగుతున్న రాద్ధాంతం పైన భూమన స్పందించారు.. దేవాలయం వంటి శాసనసభ, శాసనమండలిలో కి దేవుడు ఫోటోలు ఎందుకు తీసుకు వెళ్ళకూడదో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు బూట్లు వేసుకుని శ్రీవారి విగ్రహాలను పలువురికి బహుమతులుగా ఇచ్చారని అప్పుడు తప్పు కానిది ఇప్పుడు ఎందుకు తప్పు అవుతుందో చెప్పాలని ప్రశ్నించారు.
అప్పుడు క్లెమోర్ మైన్స్ పేలింది అందుకే చంద్రబాబు
అపచారాలు చంద్రబాబు చేస్తూ ఎదుటి వారి పైన నెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు. అలిపిరి వద్ద తనపై జరిగిన దాడి పైన పదేపదే మాట్లాడే చంద్రబాబు తిరుమల శ్రీవారే దిగొచ్చి తనను కాపాడాడని చెప్పుకుంటారు అని, తాను చేసిన పాపాల వల్లే క్లెమోర్ మైన్స్ పేలాయని ఎందుకు అనుకోరు అని ప్రశ్నించారు.
ప్రజాక్షేత్రంలోకి వెళ్లి వివరిస్తాం
కల్తీ నెయ్యి మూలాలు చంద్రబాబు సొంత హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీల దగ్గరే ఉన్నాయని వీటిపై మరింతగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి వివరిస్తామని ఆయన అన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలకు పాల్పడినా, ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చేసినా సత్యం దాగి ఉండదని భగవంతుడు, న్యాయస్థానాలు చంద్రబాబుకు బుద్ధి చెప్పడం ఖాయమని భూమన పేర్కొన్నారు.


