Andhra Pradesh
oi-Dr Veena Srinivas
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే తన సేవలను ఎక్కడికి ఎక్కడ విస్తరిస్తూ ఉంది. అదనపు రైల్వే లైన్లను ఏర్పాటు చేయడం, కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ అనేక కార్యక్రమాలతో పాటు రైలు ప్రయాణికుల సౌకర్యం కోసం దక్షిణ మధ్య రైల్వే అనేక ముఖ్యమైన ప్రాంతాలలో నడిచే పలు రైళ్లకు వివిధ స్టేషన్లలో హాల్టింగ్ కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంటుంది.
తిరుపతి వెళ్ళే రైలుకు అక్కడ అదనపు హాల్టింగ్
తాజాగా తిరుపతి అకోలా తిరుపతి ఎక్స్ప్రెస్ కు మొలకలచెరువులో అదనపు హాల్ట్ ను కేటాయించింది. ఈ నిర్ణయం మార్చి 6వతేదీ నుండి అమలులోకి వస్తున్నట్టు రైల్వే అధికారులు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ నిర్ణయంతో తిరుమలకు వెళ్లే భక్తులకు లబ్ధి చేకూరుతుంది. వేసవి సెలవులలో యాత్రికుల రద్దీ పెరిగే అవకాశం ఉన్న కారణంగా ప్రయాణికులకు ఈ అదనపు స్టాపేజ్ ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు.
దక్షిణ మధ్య రైల్వే ప్రకటన
దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న నిర్ణయం ప్రకారం రైలు నెంబర్ 07605 తిరుపతి అకోలా ఎక్స్ప్రెస్ ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు తిరుపతి నుండి బయలుదేరుతుంది. ఇది పాకాల, పీలేరు, మదనపల్లె రోడ్డు మీదుగా మధ్యాహ్నం రెండు గంటల 49 నిమిషాలకు మొలకల చెరువుకు చేరుకుంటుంది. మొలకలచెరువు లో ఒక నిమిషం పాటు ఆగి రెండు గంటల యాభై నిమిషాలకు తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.
ఈ మార్గంలో అకోలాకు వెళ్లనున్న ఎక్స్ ప్రెస్ రైలు
ఆ తరువాత ఈ రైలు కదిరి, ధర్మవరం, అనంతపురం, డోన్, కర్నూలు, గద్వాల్, వనపర్తి, మహబూబ్నగర్ రైల్వే స్టేషన్ల మీదుగా రాత్రి ఒంటి గంట నలభై నిమిషాలకు కాచిగూడ కు చేరుకుంటుంది. ఆపైన కామారెడ్డి, నిజామాబాద్ మార్గంలో ప్రయాణం చేసి తర్వాత రోజు మధ్యాహ్నం ఒంటిగంట 15 నిమిషాలకు మహారాష్ట్రలోని అకోలా కు చేరుకుంటుంది.
మళ్ళీ దక్షిణ మధ్య రైల్వే ప్రకటన వరకు హాల్టింగ్
అకోలా నుండి తిరుపతికి వచ్చే రైలు రైలు నెంబర్ 07606 ఉదయం ఎనిమిది గంటల 10 నిమిషాలకు అకోలా రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇది మరుసటి రోజు తెల్లవారుజామున రెండు గంటల 34 నిమిషాలకు మొలకల చెరువు స్టేషన్లో నిమిషం పాటు ఆగుతుంది. తదుపరి ప్రకటన వచ్చే వరకు ఈ హాల్ట్ కొనసాగుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
తిరుమల భక్తుల రద్దీ దృష్ట్యా నిర్ణయం
మొత్తంగా ఈ వేసవి కాలంలో తిరుమలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మొలకల చెరువులో కూడా తిరుపతి అకోలా తిరుపతి రైలుకు హాల్టింగ్ ఇచ్చారు. తదుపరి రైల్వే శాఖ ప్రకటన వరకు ఈ హాల్టింగ్ కొనసాగుతుందని తెలిపారు.


