తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు

Date:


International

oi-Chandrasekhar Rao

పొరుగుదేశం పాకిస్తాన్.. నానాటికీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరకుపోతోంది. ఇరాన్ యుద్ధం ఆరంభమైన తర్వాత ఆ దేశ పరిస్థితి మరింత దిగజారింది. అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ పై సైనిక చర్యలకు దిగాల్సి రావడం.. మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా తయారైంది. మిత్రదేశం చైనా గానీ, అమెరికా గానీ గతంలో ప్రకటించిన ఫైనాన్షియల్ ప్యాకేజీలు ఇంతవరకూ విడుదల కాకపోవడం అదనపు భారంగా పరిణమించింది.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. దేశంలో నెలకొన్న చమురు సంక్షోభం, తీవ్రతరమౌతోన్న ఆర్థిక దుస్థితి నేపథ్యంలో పొదుపు చర్యలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పాకిస్తాన్ దినోత్సవ వేడుకలను రద్దు చేశారు. ఈ నెల 23న జరగాల్సిన పాకిస్తాన్ డే పరేడ్, అనుబంధ లాంఛనప్రాయ కార్యక్రమాలు నిర్వహించబోమని స్పష్టం చేశారు. రాష్ట్రాల రాజధానుల స్థాయిలో ఈ వేడుకలను నామమాత్రంగా జరుపుకోవాలని, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి మాత్రమే పరిమితం చేయాలని సూచించారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. గల్ఫ్ చమురు సంక్షోభం, ప్రభుత్వం ప్రకటించిన పొదుపు చర్యల నేపథ్యంలో 23న జరగాల్సిన పాకిస్తాన్ దినోత్సవ పరేడ్, అనుబంధ కార్యక్రమాలు రద్దయినట్లు పీఎంఓ స్పష్టం చేసింది. విస్తృత పొదుపు విధానాలకు అనుగుణంగా ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. ఆ రోజున పరిమిత స్థాయిలో ఎటువంటి ఆర్భాటాలు లేకుండా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించింది.

ప్రతి సంవత్సరం మార్చి 23న సైనిక పరేడ్‌తో పాకిస్తాన్ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ముస్లింల కోసం స్వతంత్ర దేశాన్ని కోరుతూ 1940లో రూపొందించిన లాహోర్ తీర్మానాన్ని స్మరించుకోవడానికి ఈ వేడుకలు నిర్వహిస్తుంటుంది పాకిస్తాన్. కిందటేడాది వరకూ క్రమం తప్పకుండా ఈ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ సారి ఆర్థిక సంక్షోభ పరిస్థితులు అడ్డు పడ్డాయి. పశ్చిమ ఆసియా, గల్ఫ్‌ యుద్ధ ప్రభావం పాకిస్తాన్ ఖజానాపై పడుతోంది.

చమురు సంక్షోభంతో ఎదురవుతున్న తీవ్ర ఆర్థిక ఒత్తిడిని అధిగమించేందుకు దేశం ఇటీవల పలు కఠిన చర్యలు తీసుకుంటోంది. పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ షరీఫ్ ప్రజల రక్షణ, వనరుల నిర్వహణకు ఉద్దేశించిన పలు పొదుపు చర్యలను ప్రకటించారు. ఇందులో ప్రావిన్షియల్ మంత్రులకు ఇంధన సరఫరా నిలిపివేత, ప్రభుత్వ వాహనాలకు పెట్రోల్, డీజిల్ భత్యాలలో 50 శాతం తగ్గింపు వంటివి ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వెసలుబాటు ఇచ్చారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related