Telangana
oi-Chandrasekhar Rao
తెలంగాణలో మొన్నటికి మొన్న మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. అధికార కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు జరిగిన ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడిక మరో ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి అవసరమైన షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. ఏర్పాట్లనూ మొదలుపెట్టింది.
రాజ్యసభ ఎన్నికలు ఇవి. త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలను భర్తీ చేయడానికి ఈ షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. తెలంగాణతో పాటు మొత్తం 10 రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 37 మంది సభ్యులు ఎన్నిక కానున్నారు. ఏప్రిల్ 9వ తేదీ నాటికి వివిధ రాష్ట్రాల నుండి మొత్తం 37 మంది సభ్యుల పదవీకాలం ముగియబోతోంది. వీరిలో తెలంగాణ నుండి డాక్టర్ అభిషేక్ మను సింఘ్వి, కేఆర్ సురేష్ రెడ్డి ఉన్నారు. మను సింఘ్వీ కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు. సురేష్ రెడ్డిని బీఆర్ఎస్ నామినేట్ చేసింది.
ఈ నెల 26వ తేదీ గురువారం నాడు నోటిఫికేషన్ విడుదల అవుతుంది. నామినేషన్లను దాఖలు చేయడానికి చివరి తేదీ మార్చి 5. ఆ మరుసటి రోజే నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 9వ తేదీ వరకు గడువు ఉంటుంది. 16వ తేదీన పోలింగ్. ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుండి ఓట్లను లెక్కిస్తారు. 20 నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది.
మొదటి విడతగా ఏప్రిల్ 2న మొత్తం 22 మంది సభ్యులు పదవీ విరమణ చేస్తారు. మహారాష్ట్ర నుండి డాక్టర్ భగవత్ కిషన్రావ్ కరద్, డాక్టర్ ఫౌజియా తహసీన్ అహ్మద్ ఖాన్, ప్రియాంక విక్రమ్ చతుర్వేది, శరద్చంద్ర గోవిందరావు పవార్, ధైర్యశీల్ మోహన్ పాటిల్, రజనీ అశోకరావు పాటిల్, రాందాస్ బందు అథవాలే, ఒడిశా నుండి మమతా మొహంతా, ముజిబుల్లా ఖాన్, సుజీత్ కుమార్, నిరంజన్ బిషి పదవీకాలం ముగుస్తుంది.
తమిళనాడు నుండి ఎన్ఆర్ ఇళాంగో, పీ సెల్వరాసు, ఎం తంబిదురై, తిరుచ్చి శివ, డాక్టర్ కనిమొళి, ఎన్విఎన్ సోము, జీకే వాసన్ పదవీ విరమణ చేస్తారు. పశ్చిమ బెంగాల్కు చెందిన రితబ్రత బెనర్జీ, సాకేత్ గోఖలే, బికాష్ రంజన్ భట్టాచార్య, సుబ్రతా బక్షి పదవీకాలం ముగుస్తుండగా, మౌసమ్ నూర్ స్థానం ఈ ఏడాది జనవరి 5 నుండే ఖాళీగా ఉంది.
రెండవ విడతలో ఏప్రిల్ 9న మొత్తం 15 మంది సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అస్సాం నుండి రామేశ్వర్ తేలి, భువనేశ్వర్ కలిత, అజిత్ కుమార్ భూయాన్ పదవీ విరమణ చేస్తారు. బీహార్ నుండి అమరేంద్ర ధారీ సింగ్, ప్రేమ్ చంద్ గుప్తా, రామ్నాథ్ ఠాకూర్, ఉపేంద్ర కుష్వాహా, హరివంశీ నారాయణ్ సింగ్ పదవీకాలం ముగియనుంది. ఛత్తీస్గఢ్ నుండి కవి తేజ్పాల్ సింగ్ తులసి, ఫూలో దేవి నేథామ్; హర్యానా నుండి కిరణ్ చౌదరి, రామ్ చందర్ జాంగ్రా, హిమాచల్ ప్రదేశ్ నుండి ఇందు బాలా గోస్వామి పదవీ విరమణ చేస్తారు.


