Telangana
oi-Dr Veena Srinivas
తెలంగాణ రాష్ట్రాన్ని గుడిసెలు లేని రాష్ట్రంగా మార్చటం లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పకడ్బందీగా అమలు చేయనుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తాజాగా ఒక కొత్త సర్వే నిర్వహించడం కోసం ప్లాన్ చేస్తుంది. మార్చి నాలుగో వారంలో రాష్ట్రవ్యాప్తంగా పేదల గుడిసెల పైన సర్వే నిర్వహించాలని నిర్ణయించింది.
పూరి గుడిసెల సర్వే
ఈ సర్వే ద్వారా అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో పూరి గుడిసెలు మరియు టార్పాలిన్ లతో ఏర్పాటు చేసుకున్న గుడిసెలను సర్వే చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మార్చి నాలుగవ వారంలో గ్రామాల వారీగా సర్వే నిర్వహించి ఆ నివేదికను తయారుచేసి, నివేదికలో గుర్తించిన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించింది.
వారికి ఇందిరమ్మ ఇళ్ళు
ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు మంజూరై కట్టుకోవడానికి ఆసక్తి చూపని వారి అనుమతితో సర్వేలో గుర్తించిన గుడిసె వాసులకు ఆ ఇళ్లను కేటాయించనుంది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కల నిజం చేయడం కోసం సర్వే ని చేపడుతుంది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 3 లక్షల 24 వేల 593 ఇందిరమ్మ ఇళ్ళు మంజూరయ్యాయి.
తెలంగాణాలో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి ప్రభుత్వ తోడ్పాటు
2, 63,058 నిర్మాణాలు జరుగుతున్నాయి. నిరుపేదల ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఇటుక, ఉక్కు వంటి సామాగ్రిని తక్కువ ధరకే అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అవసరమైన చోట ఇసుక బజార్లను కూడా ఏర్పాటు చేసి ‘మన ఇసుక వాహనం’ ద్వారా లబ్ధిదారులకు ఇసుక సరఫరా చేయాలని నిర్ణయించింది.
రెండో విడత ఇందిరమ్మ ఇళ్ళ మంజూరుకు కసరత్తు
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం నాలుగు విడతలలో లబ్ధిదారుల ఖాతాలలో జమ అవుతుంది. ఇదిలా ఉంటే మొదటి విడత ఇళ్ళ నిర్మాణాలు పూర్తవుతున్న క్రమంలో, మళ్లీ రెండవ విడత ఇళ్ల మంజూరుకు నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా ఏప్రిల్ లో రెండవ విడత ఇళ్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.


