తెలంగాణా ప్రజలకు ఉగాది కానుక ఇస్తున్న రేవంత్ సర్కార్!

Date:


Telangana

oi-Dr Veena Srinivas

వైద్యరంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే ఆసుపత్రుల నిర్మాణం చేపట్టింది. సామాన్య నిరుపేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారకూడదని భావించి తెలంగాణ ప్రభుత్వం ఈ ఆసుపత్రులను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

టిమ్స్ కు సూపర్ స్పెషాలిటీ డాక్టర్ లను కేటాయిస్తూ ఉత్తర్వులు

ఈ క్రమంలోనే హైదరాబాద్లోని సనత్ నగర్ ప్రాంతంలో వెయ్యి పడకల సామర్థ్యంతో టిమ్స్ ఆస్పత్రి నిర్మాణం చేపట్టింది. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రిని ఉగాది సందర్భంగా ప్రారంభించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఆసుపత్రి నిర్వహణకు అవసరమైన సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఉగాదికా.. తెలంగాణా అవతరణ దినోత్సవం నాడా ప్రారంభం

ప్రత్యేకంగా గుండె సంబంధిత ఆపరేషన్లు, అవయవ మార్పిడి వంటి అత్యవసర వైద్య సేవలను అందించేలా ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే గతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ ఆసుపత్రిని ఉగాదికి ప్రారంభిస్తామని ప్రకటించారు. ఉగాది నాటికి క్షేత్రస్థాయిలో అన్ని పనులు పూర్తయ్యే పరిస్థితి లేదని, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ప్రారంభిస్తే మంచిది అన్న పరిస్థితి ఓవైపు కనబడుతుంది.

మంత్రి దామోదర రాజనర్సింహ పనుల జాప్యం పైన అధికారులపై ఆగ్రహం

ఇచ్చిన మాట ప్రకారం ఉగాదికి ఆసుపత్రిని ప్రారంభించాలని పట్టుదలతో ఉన్న మంత్రి దామోదర రాజనర్సింహ పనుల జాప్యం పైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సనత్ నగర్ టిమ్స్ ను ఎట్టి పరిస్థితులలోనూ ఉగాదికి ప్రారంభించాలని, ఆ దిశగా పనులు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. దీంతో ఉగాదికి సనత్ నగర్ టిమ్స్ ప్రారంభం అయ్యే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు

రాష్ట్రంలో అధునాతన వైద్య సేవలకు కేంద్రంగా టిమ్స్ ఆసుపత్రిని తీర్చిదిద్దాలని, ప్రజలకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే టిమ్స్ పైన ఫోకస్ చేశారు. టిమ్స్ ఆసుపత్రి ప్రారంభంతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ప్రభుత్వ వైద్య రంగం మరింత బలోపేతం కానుందని అధికారులు పేర్కొంటున్నారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related