Telangana
oi-Chandrasekhar Rao
Railway Manufacturing Unit: తెలంగాణలో మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. దీనివల్ల రాష్ట్రం దశ దిశ మారడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. అదే- రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. 160 ఎకరాల విస్తీర్ణంలో ఖాజీపేట్ వద్ద నిర్మితమౌతోంది. దీని నిర్మాణ వ్యయం 521.36 కోట్ల రూపాయలు.
ఇక్కడ వ్యాగన్లు తయారు కానున్నాయి. సంవత్సరానికి 2,400 వ్యాగన్ల తయారీ సామర్థ్యంతో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం కొనసాగుతోంది. 2023 జులై 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆర్ఎంయు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. తొలుత దీన్ని వ్యాగన్ రిపేర్ వర్క్షాప్, పీరియాడికల్ ఓవర్హాలింగ్ యూనిట్గా ప్రతిపాదించారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం దీని స్థాయిని పెంచింది. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా బదలాయించింది.
దీనికి సంబంధించిన వివరాలు, ఫొటోలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి వెల్లడించారు. పనుల పురోగతి గురించి వివరించారు. 85 శాతం పనులు పూర్తయినట్లు తెలిపారు. నిర్మాణంలో ఉన్న వాటిలో మెయిన్ షాప్ అంటే.. వ్యాగన్ల తయారీ కోసం కేటాయించిన యూనిట్, టెస్ట్, పెయింట్ షాపులు, పరిపాలనా సౌకర్యాలు, అంతర్గత రైల్వే ట్రాక్లు, ఇతర యూనిట్లు ఉన్నాయి.
స్టోర్ వార్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. పిట్ ట్రావెర్సెస్, టెస్ట్ షాప్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి.
ఈ ఏడాది చివరి నాటికి నిర్మాణం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. రైల్వేల రోలింగ్ స్టాక్ల తయారీ సామర్థ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రాంతీయ పారిశ్రామిక వృద్ధికి పెద్దఎత్తున ఊతమిస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు. నెక్స్ట్ జనరేషన్ ఇంటర్సిటీ రైళ్లతో సహా రోలింగ్ స్టాక్ల తయారీకి కేంద్రంగా నిలుస్తుందని అన్నారు.
మెయిన్ రైల్వే లైన్ తో దీన్ని అనుసంధానించడానికి 13.15 కిలోమీటర్ల ఇంటర్నల్ ట్రాక్ నెట్వర్క్ను అభివృద్ధి చేశారు. దేశవ్యాప్తంగా వివిధ జోన్లకు ఇక్కడి నుంచే రైల్వే వ్యాగన్లు సరఫరా కావడం ఖాయంగా కనిపిస్తోంది. సంవత్సరానికి 2,400 వ్యాగన్లను తయారు చేయాలంటూ రైల్వే మంత్రిత్వ శాఖ భావిస్తోన్న నేపథ్యంలో- వీటి కొరత తీరుతుందని జీ కిషన్ రెడ్డి చెప్పారు.


