India
oi-Sai Chaitanya
తమిళనాడు ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీవీకే విజయ్ ను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ నేతలు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా కీలక మంత్రాంగం కొనసాగుతోంది. ఈ సారి త్రిష కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అందులో భాగంగా పొత్తు డీల్ పైన కొత్త ఆఫర్లు తెర మీదకు వచ్చినట్లు తెలుస్తోంది. ‘జననాయగన్’ సినిమా పైనా కొత్త సమాచారం బయటకు వస్తోంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు హోరా హోరీగా మారుతున్నాయి. డీఎంకే- ఎన్డీఏ తో పాటుగా టీవీకే ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు సిద్దం అవుతున్నాయి. టీవీకే ఎన్డీఏలో చేరుతుందని.. ఈ మేరకు బిగ్ ఆఫర్లు వచ్చినట్లు ప్రచారం సాగింది. అయితే, తాజాగా టీవీకే నేతలు తాము సొంతంగానే పోటీ చేస్తామని తేల్చి చెబుతున్నారు. ఇదే సమయంలో టీవీకే వరుస వివాదాలను కొని తెచ్చుకుంటోంది. ఈ సమయంలో త్రిష కేంద్రంగా టీవీకే పొత్తు వ్యవహారం పైన కొత్త చర్చలు తెర మీదకు వస్తున్నాయి.
ఎన్డీఏలోకి టీవీకే చేరిక పైన త్రిష తో సంప్రదింపులు మొదలైనట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎన్డీఏ-టీవీకే పొత్తు సినీనటి త్రిష చేతుల్లో ఉందనే వాదన ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో పాలక డీఎంకేదే పైచేయి అని, విపక్ష ఎన్డీఏపై 5 శాతం ఓట్ల ఆధిక్యంతో ఉందని తాజాగా సర్వే చేసిన ప్రముఖ సంస్థలు ప్రధాన పార్టీలకు నివేదికలు సమర్పించాయి.
తేలని పొత్తుల లెక్కలు… ఉత్కంఠ పెంచుతున్న సర్వేలు
అదే సమయంలో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి 12 శాతం ఓట్లు రావచ్చని పలు సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఎన్డీఏ నేతలు అప్రమత్తమయ్యారు. ఎలాగైనా విజయ్ను తమ వైపు తిప్పుకొనేందుకు సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కరూర్ తొక్కిసలాట ఘటన వ్యవహారం విజయ్ను ఇప్పటికీ వెంటాడుతోంది. సీబీఐ విచారణతో ఆయన ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆయన ‘జననాయగన్’ సినిమాకు కేంద్ర సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్సు రావడం లేదు.
ఈ నేపథ్యంలో ఆయనకు సన్నిహితురాలిగా భావిస్తున్న త్రిష తో ఎన్డీఏ ముఖ్య నేతలు భేటీ అయినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. ఈ చర్చల్లో పొత్తు ఖాయమైతే టీవీకే కు దక్కే ప్రయోజనాల పైన సీట్లు.. భవిష్యత్ ఆఫర్లు ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో సెన్సార్ బోర్డు సైతం విజయ్ సినిమాను పునఃపరిశీలిం చేందుకు తాజాగా అంగీకరించినట్లు తెలుస్తోంది. మరో వైపు అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి కుమారుడు మిధున్ కూడా పలు మార్లు త్రిషతో సమావేశమైనట్లు తెలుస్తోంది. అటు టీవీకే నేతలు తమకు ఎవరితో పొత్తు ఉండదని చెబుతున్న వేళ.. త్రిష కేంద్రంగా సాగుతున్న ఈ ప్రచారం ఎన్నికల వేళ ఆసక్తి కరంగా మారుతోంది.


