Telangana
oi-Dr Veena Srinivas
దేశంలోనే వినూత్న కార్యక్రమానికి తెలంగాణ ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. తెలంగాణ ఆర్టీసీ జి.ఐ ఆన్ వీల్స్ పేరుతో బస్సుల పైన జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందిన ఆరు కళల ముద్రణను చేపడుతూ దేశంలోనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. హైదరాబాద్ ఎంజీబీఎస్ లో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టి జి ఎస్ ఆర్టిసి ఎండి నాగిరెడ్డి దీనిని జెండా ఊపి ప్రారంభించారు.
స్థానిక కళాకారులకు ప్రోత్సాహం అందించేలా బస్సులకు జి. ఐ ట్యాగింగ్
తెలంగాణ సంస్కృతిని చాటే విధంగా, పర్యాటకులను ఆకర్షించే విధంగా, స్థానిక కళాకారులకు ప్రోత్సాహం అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. పర్యాటకానికి ప్రాధాన్యతను ఇచ్చే ప్రభుత్వ లక్ష్యంగా ఇది నిలుస్తుంది. బస్సులపైన పోచంపల్లి ఇక్కత్, నారాయణపేట చీరలు, నిర్మల్ పెయింటింగ్, చేర్యాల స్క్రోల్ పెయింటింగ్, వరంగల్ తివాచీలు, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీలను ముద్రించి ఆ బస్సులను నడపనున్నారు.
ఆరు ఎక్స్ ప్రెస్ బస్సులకు జి.ఐ స్టిక్కర్లు
జె.ఎన్.టి.యు ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు డిజైన్ చేసిన ఈ ప్రత్యేక స్టిక్కర్లను ఒక్కో జిల్లాకు చెందిన ఆరు ఎక్స్ప్రెస్ బస్సులకు అమరుస్తారు. ఈ బస్సులు హైదరాబాద్ నుంచి పోచంపల్లి, హన్మకొండ, నారాయణపేట, కరీంనగర్, నిర్మల్ మార్గాలలో తిరుగుతాయి. జిఐ ట్యాగ్ పొందిన వాటిలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పోచంపల్లి ఇక్కత్ కు 2004- 2005 లో గుర్తింపు లభించింది.
తెలంగాణలో ఆ ప్రాంతాల కళా నైపుణ్యానికి ప్రతీక
కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీకి 2007లో గుర్తింపు లభించింది. నారాయణపేట చీరలు చేనేత నైపుణ్యానికి ప్రసిద్ధి చెందాయి. వరంగల్ తివాచీలు ఆ ప్రాంత సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. సిద్దిపేట జిల్లా చేర్యాల స్క్రోల్ పెయింటింగ్స్ ఆ ప్రాంత కళా నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. 400 చరిత్ర ఉన్న నిర్మల్ పెయింటింగ్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కళగా గుర్తింపు పొందింది.
కళలకు ప్రచారం, ప్రోత్సాహం
ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఉన్న కళాకృతులతో ప్రతి జిల్లాలోను బస్సులు తిరగడం ఆ ప్రాంత వాసులకు తమ కళలను గుర్తు చేయడమే కాకుండా, ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారిని సైతం ఆకట్టుకుని, ఆయా కళలకు వారి చేయూతనిచ్చేలా చేయడానికి, కళల ప్రచారానికి దోహదం చేస్తుంది.


