Business
oi-Jakki Mahesh
భారత ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా మహారాష్ట్రలో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం చుట్టింది. నాగపూర్ వేదికగా జరిగిన ‘అడ్వాంటేజ్ విదర్భ’ సదస్సులో మహీంద్రా కంపెనీ ఓ సంచలన ప్రకటన చేసింది. సుమారు రూ.15 వేల కోట్ల భారీ పెట్టుబడితో నాగపూర్ సమీపంలో తన చరిత్రలోనే అతిపెద్ద ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం తలరాతే మారిపోనుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
1500 ఎకరాల్లో మెగా ప్లాంట్
ఈ భారీ ప్రాజెక్టు కోసం మహీంద్రా నాగపూర్ సమీపంలో సుమారు 1,500 ఎకరాల విస్తీర్ణంలో ఓ మెగా ప్లాంట్ను నిర్మించనుంది. కేవలం నాగపూర్కే పరిమితం కాకుండా.. ఛత్రపతి శంభాజీనగర్ (గతంలో ఔరంగాబాద్)లో మరో 150 ఎకరాల్లో ప్రత్యేకంగా సప్లయర్ పార్క్ను కూడా కంపెనీ అభివృద్ధి చేయనుంది. దీనివల్ల వాహన తయారీకి అవసరమైన విడిభాగాల సరఫరా మరింత సులభతరం అవుతుంది. వచ్చే పదేళ్ల కాలంలో విడతల వారీగా ఈ రూ. 15,000 కోట్ల పెట్టుబడిని కంపెనీ పెట్టనున్నట్లు తెలిసింది.
అసాధారణ ఉత్పత్తి సామర్థ్యం – లక్ష్యాలు
ఈ మెగా ప్లాంట్ 2028 నుంచి తన వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించేలా కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్లాంట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. ఇది ఇండియాలోనే మహీంద్రాకు అతిపెద్ద తయారీ కేంద్రంగా నిలుస్తుంది. ఇక్కడ ప్రతి ఏటా 5 లక్షలకు పైగా కార్లు, లక్షకు పైగా ట్రాక్టర్లను తయారు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ తయారయ్యే వాహనాలు కేవలం భారతీయ మార్కెట్ కే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాలకు ఎగుమతి కానున్నాయి.
మల్టీ-ప్లాట్ఫారమ్ తయారీ కేంద్రం
ఈ ప్లాంట్ మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ అన్ని రకాల వాహనాలను ఒకే చోట తయారు చేసే సదుపాయం ఉంటుంది. మహీంద్రాకు చెందిన ‘NU_IQ’ వంటి అధునాతన ఆర్కిటెక్చర్ను ఉపయోగించి పెట్రోల్, డీజిల్ వాహనాలతో పాటు భవిష్యత్తు అవసరాలైన ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. అత్యాధునిక రోబోటిక్స్, ఆటోమేషన్, డిజిటల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్తో ఈ ఫ్యాక్టరీని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్నారు.
రాష్ట్ర అభివృద్ధికి మైలురాయి
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ప్రాజెక్టును రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలో ఓ మైలురాయిగా అభివర్ణించారు. మహీంద్రా వంటి దిగ్గజ సంస్థ ఇంతటి భారీ పెట్టుబడి పెట్టడం వల్ల విదర్భ ప్రాంతంలో వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. అలాగే మహీంద్రా ఆటో అండ్ ఫార్మ్ సెక్టార్ సీఈఓ రాజేష్ జెజూరికర్ మాట్లాడుతూ.. “మేక్ ఇన్ ఇండియా ఫర్ ద వరల్డ్” అనే నినాదాన్ని నిజం చేస్తూ, ప్రపంచ స్థాయి వాహనాలను నాగపూర్ గడ్డపై తయారు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
మరిన్ని విస్తరణ ప్రణాళికలు
నాగపూర్తో పాటు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో కూడా మహీంద్రా తన ముద్రను బలోపేతం చేసుకుంటోంది. నాసిక్, ఇగత్పురి ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న ప్లాంట్లను విస్తరించడానికి కంపెనీ అదనంగా భూమిని సేకరిస్తోంది. మొత్తంగా మహారాష్ట్రలోని మూడు ప్రధాన కేంద్రాల్లో కలిపి 2,000 ఎకరాలకు పైగా భూమిని సేకరించి, తన ఇంజన్ సామర్థ్యాన్ని, అత్యాధునిక సాంకేతికతను మెరుగుపరచాలని కంపెనీ నిర్ణయించింది.


