India
oi-Lingareddy Gajjala
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో భారత వంటశాలల్లో ఎల్పీజీ సెగలు మొదలయ్యాయి. 62 శాతం దిగుమతులపైనే ఆధారపడ్డ భారత్కు సరఫరా అంతరాయం కలగడంతో, గ్యాస్ సిలిండర్లకు ప్రత్యామ్నాయం ఏది? అనే చర్చ మొదలైంది. సరిగ్గా ఇదే సమయంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. కేవలం అర లీటరు నీటితో హైడ్రోజన్ను సృష్టించి, కొన్ని నెలల పాటు వంట చేసుకోవచ్చని సంచలన ప్రకటన చేశారు.
ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసిన మహేష్ జీనిని శ్రీ శ్రీ రవిశంకర్ అభినందించారు. “నీటితో బొగ్గును ఎలా కాల్చవచ్చో మహేష్ కనిపెట్టారు. కేవలం అర లీటరు నీటితో కొన్ని నెలల పాటు వంట చేసుకోవచ్చు” అని ఆయన తెలిపారు. ఈ యంత్రం నీటిలోని హైడ్రోజన్ను, ఆక్సిజన్ను వేరు చేస్తుంది. హైడ్రోజన్ ఇంధనంగా మారి బొగ్గును మండించగా, ఆక్సిజన్ గాలిలోకి విడుదలవుతుంది. దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి హాని కలగకపోగా, గాలి మరింత శుభ్రంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ టెక్నాలజీని గ్రామగ్రామానికి..
సాంప్రదాయ ఎల్పీజీ గ్యాస్తో కలిగే ఆరోగ్య సమస్యలను కూడా శ్రీ శ్రీ రవిశంకర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. గ్యాస్ మంటపై రొట్టెలను నేరుగా కాల్చడం వల్ల అవి నల్లగా మారి క్యాన్సర్కు దారితీసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అయితే, ఈ నీటి ఆధారిత పద్ధతిలో కార్బన్ ఉద్గారాలు ఉండవు. ఈ టెక్నాలజీని గ్రామగ్రామానికి తీసుకెళ్లడం ద్వారా ప్రజలు సిలిండర్లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని, ఇది భారత ఆర్థిక వ్యవస్థకు గొప్ప ఊతమిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎల్పీజీ సంక్షోభం వేళ చక్కని ప్రత్యామ్నాయం?
భారతదేశం తన ఎల్పీజీ అవసరాల కోసం 62% దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం కారణంగా సముద్ర రవాణా మార్గాలు మూసుకుపోవడంతో, గృహ అవసరాలకు ఎల్పీజీ కేటాయింపులు కష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో కోట్ల సంఖ్యలో ఉన్న గ్యాస్ సిలిండర్లను ఈ చౌకైన, శుభ్రమైన ఇంధనంతో భర్తీ చేయడమే తన లక్ష్యమని శ్రీ శ్రీ రవిశంకర్ స్పష్టం చేశారు. తొలుత ఈ ప్రాజెక్టును తమ ఆశ్రమంలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.
భారత్లో నీటితో గ్యాస్ తయారీ ప్రాక్టికల్ గా సాధ్యమేనా?
1. ఎలక్ట్రోలిసిస్ ప్రక్రియ (Electrolysis):
నీటిని (H2O) హైడ్రోజన్, ఆక్సిజన్గా విడగొట్టే ప్రక్రియను ‘ఎలక్ట్రోలిసిస్’ అంటారు. దీనికి భారీగా విద్యుత్ శక్తి అవసరం. నీటి నుండి పొందే శక్తి కంటే, దాన్ని విడగొట్టడానికి ఉపయోగించే విద్యుత్ ఖర్చు ఎక్కువగా ఉండటం వల్ల ప్రస్తుతం ఇది చాలా ఖరీదైన పద్ధతి.
2. నిల్వ – భద్రత:
హైడ్రోజన్ అత్యంత వేగంగా మండే గుణం (Highly Inflammable) ఉంది. దీన్ని ఇంట్లో వాడుకోవాలంటే అత్యంత పటిష్టమైన భద్రతా ప్రమాణాలు ఉండాలి. చిన్నపాటి లీకేజీ జరిగినా ప్రమాదం తీవ్రంగా ఉంటుంది.
3. హైడ్రోజన్ స్టౌవ్ డిజైన్:
సాధారణ ఎల్పీజీ స్టౌవ్లలో హైడ్రోజన్ను వాడలేం. దీని మంట చాలా వేడిగా ఉంటుంది. దీనికోసం ప్రత్యేకమైన బర్నర్లు – కిట్లను తయారు చేయాలి.
4. భారత ప్రభుత్వం చర్యలు:
నిజానికి భారత్ ఇప్పటికే ‘నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్’ ద్వారా ఈ దిశగా అడుగులు వేస్తోంది. భారీ స్థాయి ప్లాంట్లలో నీటి నుండి హైడ్రోజన్ను ఉత్పత్తి చేసి పరిశ్రమలకు వాడాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, ఒక చిన్న యంత్రంతో ఇంటిలోనే వంట చేసుకోవడం అనేది ఇప్పటికీ ప్రయోగ దశలోనే ఉంది.
🚨No LPG Required. Cooking Gas from Just Water . Mr Mahesh Created A stove can run for 6 months from 0.5Ltr Water and showed it before Sri Sri Ravishanker
Every Crisis is an Opportunity. Can Govt work on this Technology ? pic.twitter.com/7rZp0kNMHN
— RapperPandit (@RapperPandit) March 10, 2026


