Telangana
oi-Bomma Shivakumar
తెలుగు రాష్ట్రాల్లో మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికు చెందిన ఫామ్ హౌస్ వ్యవహారంలో వ్యాపారవేత్తలు, రియల్టర్లు, రాజకీయనేతలు ఇన్ వాల్వ్ కావడంతో రాజకీయంగా తీవ్ర చర్చలకు దారితీసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో పాటు మొత్తం 11 మంది ఈ పార్టీలో పాల్గొన్నట్లు సమాచారం. వారిలో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఆరుగురికి డ్రగ్ పాజిటివ్ రావడంతో సంచలనంగా మారింది.
అయితే ఇదే విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బాధ్యతగల ప్రజాప్రతినిధుల స్థానంలో ఉండి డ్రగ్స్ వాడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. డ్రగ్స్ తో పాటు ఏదైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడడాన్ని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుందని తెలిపారు. డ్రగ్స్ వాడుతూ.. అమ్ముతున్న వారిని రాజకీయాలతో సంబంధం లేకుండా చట్టం ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు డ్రగ్స్ కేసును బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.
Drugs create monsters out of human beings. It is unfortunate that even people in responsible positions are resorting to drug usage
I personally am strictly against drugs and usage of illicit substances.
My party BRS condemns usage of drugs and any illegal activities. Any one…
— KTR (@KTRBRS) March 15, 2026
“అన్ని రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు డ్రగ్స్ పరీక్షకు హాజరు కావాలని మహేష్ కుమార్ గౌడ్ సూచనను నేను స్వాగతిస్తున్నాను. నేను ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉన్నానని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను.. ఏ సమయమైనా నేను ఎలాంటి పరీక్షకైనా సిద్ధం.. ఏ సంబంధం లేకున్నా, నా పేరును ఈ డ్రగ్స్ కేసులలో లాగితే వారికి లీగల్ నోటీసులు ఇస్తాను” అని కేటీఆర్ స్పష్టం చేశారు.
అంతకుముందే ఇదే వ్యవహారంపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ప్రజాప్రతినిధులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. సమాజంలో డ్రగ్స్ వినియోగం విపరీతంగా పెరగడం అత్యంత దురదృష్టకరమని, దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.


