India
oi-Bomma Shivakumar
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చమరు, గ్యాస్ సంక్షోభం కారణంగా ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నాయి. గ్యాస్ మంటలు భారత్ నూ తాకాయి. భారత్ లోని ప్రధాన నగరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు ఇప్పటికే మూతపడుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఆయిల్ మినిస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. LPG కు ప్రత్యామ్నాయంగా 40 వేల కిలోలీటర్ల అదనపు కిరోసిన్ ను రాష్ట్రాలకు కేటాయించినట్లు వెల్లడించింది.
దేశవ్యాప్తంగా గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ఆయిల్ మినిస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. LPG కు ప్రత్యామ్నాయంగా 40 వేల కిలోలీటర్ల అదనపు కిరోసిన్ ను రాష్ట్రాలకు కేటాయించినట్లు వెల్లడించింది. అయితే త్వరలోనే మరిన్ని కమర్షియల్ సిలిండర్లను విడుదల చేస్తామని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన లబ్ధిదారులకు వాటిని అందజేయనున్నట్లు స్పష్టం చేసింది.
మరోవైపు వంట గ్యాస్ కొరతపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. హర్మూజ్ జలసంధిలోని 28 భారత నౌకలు సేఫ్ గానే ఉన్నాయని పేర్కొంది. గ్యాస్ సంక్షోభాన్ని నివారించడంలో రాష్ట్రాలే కీలకంగా మారాలని సూచనలు చేసింది. బ్లాక్ మార్కెట్ ను రాష్ట్రాలే నిరోధించాలని తెలిపింది. ఈ మేరకు ప్రతిరోజు 50 లక్షల సిలిండర్లు సరఫరా చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక అంతకుముందు భారత్ జెండా ఉన్న క్రూడాయిల్ ట్యాంకర్లకు ఇరాన్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. భారత్- ఇరాన్ విదేశాంగమంత్రుల చర్చల అనంతరం ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. అనంతరం హర్మూజ్ జల సంధి నుంచి రెండు క్రూడాయిల్ నౌకలు ముంబై చేరుకున్నాయి.
ఇక దేశవ్యాప్తంగా గ్యాస్ సంక్షోభం ముదురుతోంది. దేశంలోని ప్రముఖ ఆలయాల్లోనూ గ్యాస్ కొరత స్పష్టంగా కనిపిస్తోంది. అయోధ్యలో బాలరాముడి దర్శనానికి నిత్యం వేలాదిగా భక్తులు వస్తుంటారు. ఇక్కడి ఆలయంలో నిత్యం 20 వేల మంది భక్తులకు భోజన ప్రసాదం అందిస్తుంటారు. అయితే గ్యాస్ సంక్షోభం కారణంగా తొలిసారిగా రామ్ రసోయి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి అలాగే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో హోటల్స్, రెస్టారెంట్స్ మూతపడుతున్నాయి. మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో బంద్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


