International
oi-Chandrasekhar Rao
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ కు చేదు అనుభవం ఎదురైంది. సెక్యూరిటీ సిబ్బంది ఆయనను ఆపివేశారు. గుర్తింపు కార్డు ఏదీ అంటూ గదమాయించారు. వివరాలను పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. ఆయన చూపించిన ఐడీ కార్డును పరిశీలించారు. ఆ తరువాతే లోనికి వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీన్ని ప్రొటోకాల్ ఉల్లంఘనగా భావిస్తోంది పాకిస్తాన్. తన అసంతృప్తిని తెలియజేసింది.
జర్మనీలోని మ్యూనిచ్ సెక్యూరిటీ సమ్మిట్ లో అసీమ్ మునీర్ పాకిస్తాన్ కు ప్రాతినిథ్యాన్ని వహించారు. దీనికి హాజరయ్యారు. సదస్సు ప్రాంగణంలో భద్రతా సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. సమ్మిట్ వేదిక వద్దకు వెళ్తోన్న సమయంలో ఓ మహిళా భద్రత అధికారి.. స్టాప్ అంటూ ఆయనను ఆపివేశారు. “మీ ఐడీ ఎక్కడ?, దయచేసి మీ గుర్తింపు కార్డును చూపించండి” అని నేరుగా అడిగారు. వెంటే ఉన్న పాక్ ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు ఆయన గురించి వివరాలు తెలియజేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆ భద్రతా అధికారి- అసీమ్ మునీర్ను అతిథిగా భావించడంలో పొరపాటు వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది. భారత్ సహా వివిద దేశాల నుంచి ఈ సమ్మిట్ కు హాజరైన మంత్రులు, అత్యున్నత అధికారుల వెంట వచ్చిన ఓ సాధారణ వ్యక్తి/ సహాయకుడిగా మాత్రమే చూశారని భావించినట్లు ఓ వెబ్ సైట్ తెలిపింది. ప్రధాన వేదికలోకి ప్రవేశించడానికి ముందు, అధికారిక గుర్తింపు తనిఖీని ఆమె తప్పనిసరి చేశారు. అసిమ్ మునీర్ అంతర్జాతీయ ప్రతిష్టకు ఇదొక మచ్చగా భావిస్తున్నారు.
ఈ సంఘటనపై పాకిస్తాన్ మాజీ మిలటరీ అధికారి ఆదిల్ రజా భిన్నంగా స్పందించారు. ఇది మునీర్కు జరిగిన గౌరవ భంగంగా భావించకూడదని, అంతర్జాతీయ వేదికలపై ఆయన ఎవరనేది తెలియదు కాబట్టే సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేశారని పేర్కొన్నారు. ఓ గేట్కీపర్ ముందు కూడా అసీమ్ మునీర్ తనను తాను పరిచయం చేసుకునే పరిస్థితి తలెత్తిందని వ్యాఖ్యానించారు. అతను ఎవరనేది అంతర్జాతీయంగా ఎవరికీ పెద్దగా తెలియదనడానికి ఇది నిదర్శనమని చెప్పారు.


