International
-Bomma Shivakumar
అఫ్గానిస్తాన్ లో పాకిస్థాన్ జరిపిన తాజా వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులలో పౌరులకు ప్రాణనష్టం, మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక నివేదికలు స్పష్టం చేశాయి. ఈ ఘటనపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది “సార్వభౌమ అఫ్గానిస్తాన్ కు శత్రువైన పాకిస్తాన్ మరో ఆక్రమణ చర్య” అని ఆయన అభివర్ణించారు. అఫ్గానిస్తాన్ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పూర్తి స్థాయిలో గౌరవించాలని భారత్ తన నిబద్ధతను బలంగా పునరుద్ఘాటించిందని అన్నారు.
అయితే భారత్ స్పందించడం కంటే ముందు.. అఫ్గానిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం పాకిస్థాన్పై ఆరోపణలు చేసింది. కాబూల్, తూర్పు అఫ్గానిస్తాన్ లోని ఇతర ప్రాంతాలలో పాక్ వైమానిక దాడులు జరిపిందని.. కనీసం ఆరుగురు పౌరులు మరణించగా, 15 మంది గాయపడ్డారని పేర్కొంది. కాందహార్ విమానాశ్రయం సమీపంలోని కామ్ ఎయిర్ ప్రైవేట్ ఎయిర్లైన్ కు చెందిన ఇంధన డిపోలపై కూడా పాక్ విమానాలు దాడి చేశాయని అఫ్గానిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపారు.
కొన్ని గంటల తర్వాత, కాబూల్ కూడా ప్రతిస్పందించినట్లు ప్రకటించి, ఇస్లామాబాద్ తో పాటు వాయువ్య పాకిస్థాన్ లోని సైనిక స్థావరాలను తమ వైమానిక దళం లక్ష్యంగా చేసుకుందని తెలిపింది. అయితే, తాజా నివేదనల ప్రకారం, పాకిస్థాన్.. పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని.. తమ దాడులు పాకిస్తానీ తాలిబాన్ మిలిటెంట్లు, వారి సహాయక నెట్ వర్క్ లపైనే దృష్టి సారించాయని వివరించింది. ఈ మేరకు ఈ ఘర్షణను ఓపెన్ వార్ గా అభివర్ణించింది.
మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నడుమ, ఈ ఘర్షణలు ప్రాంతీయ స్థిరత్వంపై అంతర్జాతీయ సమాజంలో ఆందోళనలను రేకెత్తించాయి. అఫ్గానిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం తమ దేశంలో పాకిస్తానీ మిలిటెంట్ గ్రూపులకు, ముఖ్యంగా పాకిస్తానీ తాలిబాన్ కు ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్తాన్ ఆరోపించింది. ఈ మిలిటెంట్లు సరిహద్దు దాటి తమ బలగాలపై దాడి చేస్తున్నారని, అఫ్గానిస్తాన్ తమ ప్రత్యర్థి భారత్ తో జతకడుతోందని పాక్ పేర్కొంది. అయితే కాబూల్ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది.


