International
oi-Bomma Shivakumar
గత కొన్ని రోజులుగా పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇరు దేశాలు ఒకరి భూభాగంపై మరొకరు వైమానిక, డ్రోన్ దాడులతో విరుచుకుపడుతున్నాయి. దీంతో సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫిబ్రవరి 21, 22 తేదీల్లో అఫ్గాన్ లోని నంగర్హర్, పక్తికా ప్రావిన్సులపై పాక్ వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. దానికి ప్రతీకారంగా పాకిస్థాన్ సరిహద్దులపై తాలిబన్ దళాలు దాడులు చేసి.. కొంత భూభాగాన్ని ఆక్రమించుకున్నట్లు తెలిపాయి.
దాంతో అఫ్గాన్ లోని కాబూల్, కందహార్ లపై బాంబుల వర్షం కురిపించాయి పాకిస్థాన్ దళాలు. దాంతో ఫిబ్రవరి 27న ఇస్లామాబాద్ లోని ఫైజాబాద్, నౌషెరా, జమ్రూద్ ప్రాంతాల్లోని సైనిక స్థావరాలు, కార్యాలయాలపై అఫ్గాన్ విమానాలు వైమానిక, డ్రోన్ దాడులు చేపట్టాయి. అయితే తాజాగా పాకిస్థాన్ సైనిక బలగాలు జరిపిన భారీ వైమానిక దాడుల్లో దాదాపు 331 మంది అఫ్గాన్ తాలిబన్ దళాలు మరణించినట్లు పాక్ అధికారులు పేర్కొన్నారు.
ఈ విషయాన్ని పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి అట్టావుల్లా తరార్ ధ్రువీకరించారు. పాక్ సైన్యం సుమారు 104 ఆఫ్ఘన్ మిలిటరీ పోస్టులను ధ్వంసం చేసిందని.. అలాగే 163 ట్యాంకులు, సాయుధ వాహనాలను నిర్వీర్యం చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు అఫ్గానిస్థాన్ రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. పాక్ స్థావరాలపై దాడులు చేసినట్లు స్పష్టం చేసింది. జలాలాబాద్ లో పాకిస్థాన్ కు చెందిన ఓ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు అఫ్గాన్ దళాలు స్పష్టం చేశాయి. అదే సమయంలో పారాచూట్ సాయంతో ఆ పైలట్ కిందకు దూకే యత్నం చేయగా తమ బలగాలు అతడ్ని సజీవంగా బంధించినట్లు అఫ్గానిస్థాన్ సైనిక ప్రతినిధి వాహీదుల్లా మొహమ్మదీ తెలిపారు.
అయితే పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ వార్తలను తీవ్రంగా ఖండించింది. తమ యుద్ధ విమానాన్ని కూల్చివేయడం, పైలట్ను బంధించడం పూర్తిగా అవాస్తవం అని పేర్కొంది. ఈ మేరకు అఫ్గానిస్థాన్ వ్యాఖ్యలను ఖండించింది. ఇక యూరోపియన్ యూనియన్.. పాకిస్థాన్- అఫ్గాన్ మధ్య ఉద్రిక్తతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు శనివారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్, అఫ్గానిస్థాన్ మధ్య జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని కోరింది. ఈ ఘర్షణలు ఇలాగే కొనసాగితే.. ప్రాంతీయ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని యూరోపియన్ యూనియన్ హెచ్చరించింది.


