పాసు మార్కుల్లో మార్పులు, ఇక నుంచి – ఎప్‌సెట్‌ పరీక్ష రద్దు.. కీలక సిఫారసులు…!!

Date:


Telangana

oi-Sai Chaitanya

తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా కనీసం ఉత్తీర్ణత మార్కులతో పాటుగా పలు మార్పులకు ప్రభుత్వానికి సిఫారసులు అందాయి. ఎప్‌సెట్‌ పరీక్షను రద్దు చేయాలని సూచనలు అందాయి. అదే విధంగా ఉపాధ్యాయులకు ఆటోమేటిక్‌ పదోన్నతులు వద్దని… ఐదేళ్లకోసారి పనితీరు అంచనా వేయాలి. అది మెరుగ్గా ఉంటేనే పదోన్నతి కల్పించాలనే తాజా సిఫార్సుల పైన ప్రభుత్వం తీసుకొనే తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇప్పుడు ప్రభుత్వం ఈ సిఫారసుల పైన అధ్యయనం చేస్తోంది.

విద్యా శాఖలో సంస్కరణలు తీసుకు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్‌ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి అందజేసిన నివేదిక లో కీలక అంశాలను ప్రస్తావించింది. అందులో భాగంగా విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కనీస ఉత్తీర్ణత మార్కులను 35 నుంచి 45 శాతానికి పెంచాలని సూచించింది. 11వ తరగతిలో బోర్డు పరీక్షను రద్దు చేయాలని సిఫారసు చేసిన కమిటీ.. ఎప్‌సెట్‌ పరీక్షను రద్దు చేసి.. ఇంటర్‌ మార్కుల ఆధారంగానే ఇంజనీరింగ్‌, ఫార్మసీ, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని నివేదికలో పేర్కొంది. కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అమెరికా, వియత్నాం, మలేసియా దేశాల్లో పర్యటించడంతోపాటు వివిధ దేశాలు, రాష్ట్రాల్లో అత్యుత్తమ విధానాలను పరిశీలించి నివేదిక రూపొందించినట్లు వివరించారు. ప్రభుత్వ బడుల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థి 5వ తరగతి పుస్తకంలోని పాఠాలు చూసి కూడా చదవలేకపోతున్నారని పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో టీచర్‌ ఒక్కరే.. యూనివర్సిటీల్లో 80 శాతం బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని నివేదించారు. విద్యా శాఖలో వెంటనే సంస్కరణలు అమలు చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డిని కమిషన్‌ కోరింది. నివేదికలోని ఒక్కో అంశంపై చైర్మన్‌ మురళి సుదీర్ఘంగా వివరించారు. శ్రద్ధగా విన్న సీఎం.. ఆయా అంశాలపై పలు సూచనలు చేశారు.

కమిటీ నివేదిక పై ప్రభుత్వం అధ్యయనం

చట్టబద్ధత కల్పించాల్సిన అంశాలు, వచ్చే ఏడాది నుంచి అమలు చేయదగిన వాటిపై నివేదిక రూపొందించే బాధ్యతను ప్రభుత్వ సలహాదారు కేశవరావు నేతృత్వంలోని కమిటీకి అప్పగించారు. ఉపాధ్యాయులకు ఆటోమేటిక్‌ పదోన్నతులు ఉండ కూడదని… వారి పనితీరు ఆధారంగానే ప్రమోషన్లు ఉండాలని సూచించారు. ఉపాధ్యాయుల పనితీరును ఐదేళ్లకోసారి అంచనా వేయాలని పేర్కొన్నారు దాని ఆధారంగా ఆ ఉపాధ్యాయునికి నివేదిక అందజేయాలన్నారు. పనితీరు మెరుగుపర్చుకోవడానికి రెండేళ్లు సమయం ఇవ్వాలని సూచించారు. అప్పటికీ తీరు మెరుగుపడ కపోతే సర్వీసు నుంచి డిస్మిస్‌ చేయాలంటూ చేసిన సిఫారసు సంచలనంగా మారింది. అన్ని పాఠశాలల్లో త్రిభాషా సూత్రం అమలు చేయాలని నివేదిక లో సూచించారు. పది, 11, 12వ తరగతుల్లో వరుసగా మూడేళ్లు బోర్డు పరీక్షలతో విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. అందుకే, 11వ తరగతిలో బోర్డు పరీక్షను రద్దు చేయాలని సిఫారసు చేసారు. పాఠశాల విద్యా శాఖ, ఇంటర్‌ బోర్డులను రద్దు చేసి.. ఒకే బోర్డుగా విలీనం చేయాలని నివేదికలో సూచించారు. కనీస ఉత్తీర్ణత మార్కులను పాఠశాల స్థాయిలో 35 నుంచి 45 శాతానికి; ఉన్నత విద్యా సంస్థల్లో 35 శాతం నుంచి 50 శాతానికి పెంచాలంటూ మరో కీలక సిఫారసు చేసారు. దీంతో.. ఇప్పుడు ప్రభుత్వం ఈ సిఫారసుల పై తీసుకునే నిర్ణయం పై ఉత్కంఠ నెలకొంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related